హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి కారణంగా మూతపడిన విద్యాసంస్థలన్నీ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అన్ని స్థాయిల విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు మొదలుకానున్నాయి. డిగ్రీ ఆపై స్థాయిల్లో మాత్రం ఆఫ్లైన్, ఆన్లైన్ బోధన కొనసాగనున్నది. ఇందుకు రాష్ట్రంలోని 95 శాతం పాఠశాలలు సిద్ధమైనట్టు అధికారులు ప్రకటించారు. మిగతా బడులను మంగళవారంలోపు సిద్ధంచేయాలని ఆదేశించారు. స్కూళ్లల్లో ఎవరైనా విద్యార్థులు కొవిడ్ బారినపడితే వారిని తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. ఇంటర్, డిగ్రీ, వృత్తివిద్యాకాలేజీల్లో మాత్రం ఐసొలేషన్ గదులను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. జలుబు, దగ్గు, జ్వరంలాంటి లక్షణాలున్న విద్యార్థులను ఐసొలేషన్ గదుల్లో ఉంచనున్నారు. బుధవారం నుంచే అన్ని రకాల వసతిగృహాలు, గురుకులాలు సైతం తెరుచుకోనున్నాయి.
పరిశుభ్రతకు అధిక ప్రాధానం: మంత్రి
పాఠశాలల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. పాఠశాలలను శుభ్రపరచడంతో సహకరించనివారి వివరాలను అందజేయాలని సూచించారు. విద్యాసంస్థల ప్రారంభం నేపథ్యంలో సోమవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాలతో కలిసి, అన్ని విభాగాల అధిపతులు, వర్సిటీల వీసీలు, డీఈవోలు, ఇంటర్ విద్య అధికారులతో వర్చువల్ సమీక్ష నిర్వహించారు. బుధవారం నుంచి అన్నిస్థాయిలతో విద్యాలయాలు ప్రారంభమవుతుండటంతో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలన్నారు. పారిశుద్ధ్యం, శానిటైజేషన్, తాగునీరు, విద్యుత్తు సౌకర్యాల పునరుద్ధరణను చేపట్టాలన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలపైనా దృష్టిపెట్టాలని, వాటిల్లో సైతం కొవిడ్ జాగ్రత్తలు పాటించేలా చూడాలని సూచించారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.
15 వరకు ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలు
హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. ప్రవేశాల గడువు మంగళవారంతో ముగియనుండగా, మరో 15 రోజులపాటు గడువు పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ సోమవారం ఆదేశాలు జారీచేశారు. మిక్స్డ్ ఆక్యుపెన్సీ కారణంగా పలు ప్రైవేట్ కాలేజీలకు ఇంటర్బోర్డు అనుబంధ గుర్తింపు దక్కలేదు. ఈ నేపథ్యంలో ప్రవేశాల గడువును పెంచారు.