ఇక సింగరేణిలో 95 శాతం ఉద్యోగాలకు స్థానికులకే. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఎండీ శ్రీధర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకే ఎక్కువ శాతం అవకాశం కల్పించాలన్న రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడే తమ సంస్థలోనూ ఇకపై జరుగనున్న ఉద్యోగ నియామకాల్లో స్థానిక రిజర్వేషన్ శాతాన్ని పెంచడానికి బోర్డు ఆమోదం తెలిపిందని ఆయన వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సింగరేణి 561వ బోర్డు సమావేశం జరిగింది. దీనికి సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ అధ్యక్షత వహించారు. ఇప్పటి వరకు సింగరేణి విస్తరించి ఉన్న 4 ఉమ్మడి జిల్లాల వారికి.. అధికారేతర ఉద్యోగాల్లో 80 శాతం స్థానిక రిజర్వేషన్ను, అధికారుల ఉద్యోగాల్లో 60 శాతం స్థానిక రిజర్వేషన్ను వర్తింపచేస్తున్నామని సీఎండీ తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి.. ఇకపై ఈ రెండు కేటగిరీల్లోనూ స్థానిక రిజర్వేషన్ను 95 శాతానికి పెంచుతూ బోర్డు ఆమోదం లభించిందని, త్వరలోనే దీనిపై ఉత్తర్వులు జారీచేస్తామని సీఎండీ శ్రీధర్ తెలిపారు.
800 మెగావాట్ల సామర్థ్యంతో మూడో ప్లాంట్ నిర్మాణం
సింగరేణి తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటికే 600 మెగావాట్ల చొప్పున రెండు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను 1200 మెగావాట్ల సామర్థ్యంతో దిగ్విజయంగా నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో 800 మెగావాట్ల సామర్థ్యంలో మూడో ప్లాంట్ను నిర్మించనుంది. ఇందుకు సంబంధించి సింగరేణి బోర్డు తన ఆమోదం తెలిపింది. రాష్ట్ర విద్యుత్ అవసరాలు, సింగరేణి వ్యాపార విస్తరణలో భాగంగా సుమారు రూ. 6790 కోట్ల అంచనా వ్యయంతో ఈ 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)కు బోర్డు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 1200 మెగావాట్ల ప్లాంట్ ద్వారా సింగరేణి సంస్థ ఏడాదికి సుమారు రూ. 500 కోట్ల వరకు లాభాలు ఆర్జిస్తుండగా.. ఈ కొత్త యూనిట్కూడా పూర్తయితే సంస్థ ఆర్థిక సుస్థిరతకు దోహదపడుతుందని భావిస్తున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు.