వనపర్తి, మే 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కుతాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. తెలంగాణ యువతకే ఎక్కువ ఉద్యోగాలు రావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని తెలిపారు. పోలీసు ఉద్యోగాల పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు సింగిరెడ్డి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో వనపర్తిలోని తన నివాస ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి నిరంజన్రెడ్డి శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం గతంలో 20 శాతం ఉద్యోగాలను ఓపెన్ కేటగిరీలో భర్తీచేసేవారన్నారు.
అవే ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తే తెలంగాణ నిరుద్యోగులకు నష్టం జరుగుతుందని భావించి, వాటిని సవరించిన తర్వాతే నోటిఫికేషన్లు ఇస్తున్నట్టు ఆయన వెల్లడించారు. అందుకే కొత్త జోన్లు, రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యమైనట్టు చెప్పారు. ఆంధ్రోళ్లకు 20 శాతం ఉద్యోగాలు దక్కాలనే నోటిఫికేషన్ల కోసం షర్మిల వంటి ఆంధ్రా నాయకులు రాద్ధాంతం చేశారన్నారు. యువత అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. వారి మాటల వెనుక అంతరార్థం తెలుసుకోవాలని కోరారు. కష్టపడి విజయం సాధించిన నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి జీవితాన్ని యువతీ,యువకులు ఆదర్శంగా తీసుకోవాలని.. ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ఆయన ఇంటర్వ్యూను ప్రతి ఒక్కరూ చదవాలన్నారు.