సిద్దిపేట / సిద్దిపేట అర్బన్, జూన్ 15: తెలంగాణ వచ్చిన తర్వాత 1.35 లక్షల ఉద్యోగాల నియామకం పూర్తిచేశామని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మరో 91 వేల ఉద్యోగాలను ప్రకటించారని, అందులో ఇప్పటికే 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయని చెప్పారు. త్వరలోనే మరో 9,200 గ్రూప్-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాబోతున్నాయని పేర్కొన్నారు. ఏడాదిలోపే ఈ ఉద్యోగాలన్నీ భర్తీచేస్తామని స్పష్టంచేశారు. ఇక నుంచి ఏటా ఉద్యోగ క్యాలెండర్ను రూపొందించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో బుధవారం నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే ఆధ్వర్యంలో పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న ఉద్యోగార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు మంత్రి హరీశ్రావు, నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
ఆత్మీయ అతిథులుగా ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్హుస్సేన్, యాదవరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, ప్రధాన వక్తలుగా సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మల్లవరపు బాలలత, వేప అకాడమీ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్ వేప పాల్గొని, అభ్యర్థులకు మార్గనిర్దేశనం చేశారు. మంత్రి మాట్లాడుతూ.. పోలీస్ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. అన్ని ఉద్యోగాల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని తెలిపారు. ఉద్యోగార్థులు చిత్తశుద్ధితో చదివి లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. కొన్నిరోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండి, తాత్కాలిక ఆనందాలు పక్కకుబెట్టి దీర్ఘకాలిక లక్ష్యం కోసం ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. సివిల్స్ ర్యాంకర్లు అఖిల్, శ్రీధర్ సైతం పాల్గొని వారి అనుభవాలను అభ్యర్థులకు తెలియజేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సదస్సు మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగింది. ముఖ్యఅతిథుల ప్రసంగాలను అభ్యర్థులు ఆద్యంతం శ్రద్ధగా విన్నారు. ఉద్యోగాలు సాధించేందుకు ప్రిపేరయ్యే పద్ధతులు, మెళకువలను ప్రధాన వక్తలు బాలలత, సీఎస్ వేప అభ్యర్థులకు వివరించారు. సదస్సుకు వెయ్యి మందికి పైగా యువతీ యువకులు రావడంతో ఆడిటోరియం కిక్కిరిసిపోయింది. హాజరైన అభ్యర్థులకు నిపుణ పుస్తకాలను ఉచితంగా అందజేశారు.