హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎంసెట్కు శనివారం 95.21 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈనెల 10న 92.33 శాతం, 11న 93.52శాతం 12న 94.80 శాతం మంది హాజరయ్యారు. శనివారం ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలోనూ 95.21శాతం విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్కుమార్, కోకన్వీనర్ ప్రొఫెసర్ విజయ్కుమార్రెడ్డి తెలిపారు. ఉదయం సెషన్లో 34,655 మంది విద్యార్థులకు గాను 32,996 మంది, మధ్యాహ్నం 34,370 మందికి 32,722 మంది పరీక్షకు హాజరైనట్టు తెలిపారు.
పరీక్షలు సజావుగా జరుగుతున్నట్టు వారు పేర్కొన్నారు. శనివారం మొదటి షిప్ట్ ఎగ్జామ్లోని ప్రశ్నలు కాస్త కఠినంగా వచ్చినట్టు నిపుణులు విశ్లేషించారు. గణితం ప్రశ్నలు కఠినంగా ఉండగా, కెమిస్ట్రీ ప్రశ్నలు సైతం కాస్త కఠినంగానే ఉన్నట్టు తెలిపారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి ఇతర ఉన్నతాధికారులు శనివారం జేఎన్టీయూలో ఎంసెట్ కార్యాలయం నుంచి పరీక్షలు జరుగుతున్న తీరును పర్యవేక్షించారు.
రేపు అగ్రికల్చర్, మెడికల్ ఎంట్రెన్స్ కీ విడుదల
ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక కీలు ఆదివారం విడుదలకానున్నాయి. ఈ నెల 10, 11 తేదీల్లో మొత్తం నాలుగు సెషన్లల్లో పరీక్షలకు హాజరైన వారి రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక కీలను విడుదల చేస్తామని కన్వీనర్ ప్రొఫెసర్ డీన్కుమార్, కో కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్కుమార్రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఆదివారం సాయంత్రం 6 నుంచి https://eamcet. tsche.ac. in వెబ్సైట్ను సంప్రదించి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రాథమిక కీపై ఈ నెల 16న సాయంత్రం 6 గంటల్లోగా ఎంసెట్ వెబ్సైట్లోని ఆబ్జెక్షన్స్ ఆప్షన్ను ఎంపిక చేసుకుని అభ్యంతరాలను వెల్లడించవచ్చని తెలిపారు.