హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలకు తొలిరోజైన సోమవారం 93.5 శాతం విద్యార్థులు హాజరైనట్టు ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. మొత్తం 4.59,240 మంది విద్యార్థులకు 4,29,177 మంది హాజరుకాగా, 30,063 (6.5 శాతం) మంది రాలేదని పేర్కొన్నారు. మంగళవారం ద్వితీయభాష (ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ) పేపర్లకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఎస్సెస్సీలో పరీక్షల్లేకుండానే పాస్కావడం, చాలాకాలం తర్వాత పరీక్షలకు హాజరుకావడంతో మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డట్లుగా విద్యార్థులు తెలిపారు. అరగంట తర్వాత కుదురుకొని, సమాధానాలు రాశామని పేర్కొన్నారు. మొదటిరోజు తెలుగు, సంస్కృతం, ఉర్దూ, అరబిక్, ఫ్రెంచ్ తదితర పేపర్లకు పరీక్షలు నిర్వహించారు. ఇందుకు సెట్ -ఏ పేపర్ను అధికారులు ఎంపికచేశారు. అన్ని పేపర్లలో ప్రశ్నలు సులభంగానే వచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. చాయిస్ ప్రశ్నలు గట్టెక్కించినట్టు పేర్కొన్నారు.
ఎట్లుందోనని అనుకున్నా
ఎస్సెస్సీ పబ్లిక్ ఎగ్జామ్స్ రాయలేదు. ఫస్టియర్ రాద్దామనుకున్న సమయంలో కరోనాతో వాయిదా పడ్డాయి. మొత్తంమీద తెలుగు పరీక్ష ఎట్లుందోనని అనుకున్నా. పేపర్ సులభంగానే వచ్చింది.
-సాయిప్రసాద్, సీతాఫల్మండి ప్రభుత్వ జూనియర్ కాలేజీ
భయాన్ని వదిలిపెట్టా..
నేను ఫస్టియర్ హిందీ పేపర్కు పరీక్ష రాశాను. మొదటిసారి, చాలాకాలం తర్వాత ఎగ్జామ్స్ రాయడంతో మొదట్లో కాస్త టెన్షన్ పడ్డా. భయం అనిపించింది. కానీ, భయాన్ని వదిలిపెట్టి, టెన్షన్ పడకుండా భేషుగ్గా రాసేశా. పేపర్ కూడా ఈజీగానే అనిపించింది.
ఏపీపీ కీపై అభ్యంతరాల స్వీకరణ
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాతపరీక్ష ప్రాథమిక కీని www.tslprb.in లో పెట్టామని, దీనిపై అభ్యంతరాలను మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు స్వీకరించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు డైరెక్టర్ వీవీ శ్రీనివాస్రావు తెలిపారు.