హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల పీజీ కోర్సుల్లోని సీట్ల భర్తీకి నిర్వహించిన కామన్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్-2023) ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో మొత్తంగా 93.42 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో 67 శాతానికి పైగా మహిళలు ఉత్తీర్ణత సాధించడం విశేషం. పురుషులు కేవలం 23 శాతం మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్ మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఈ ఫలితాలను విడుదల చేశారు. జూన్ 30 నుంచి జూలై 10 వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తంగా 55,739 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 19,954 మంది పురుషులకు 18,182 మంది, 40,230 మంది మహిళలకు 37,567 మహిళలు క్వాలిఫై అయ్యారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, ప్రొఫెసర్ వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ ఎన్ శ్రీనివాస్రావు, ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సంక్షేమ గురుకులాలు, కల్యాణలక్ష్మి, షాదీముబాకర్ పథకాలు రాష్ట్రంలో చదువుల విప్లవానికి నాంది పలుతుకున్నాయి. ఈ రెండు పథకాల అండతో అమ్మాయిలు చదువుల్లో ధైర్యంగా రాణిస్తున్నారు. ఇదే విషయం సీపీగెట్ ఫలితాల్లో నిరూపితమై పెద్ద ఎత్తున గురుకులాల విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సామాజిక వర్గాల వారీగా ఫలితాలను పరిశీలిస్తే ఎస్సీలు 25 శాతం, ఎస్టీ విద్యార్థులు 13 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ఎస్సీ మహిళలు 9,382, ఎస్టీ మహిళలు 4,091, బీసీలు 20,063 మంది చొప్పున ఉన్నారు. ఈసారి సీపీగెట్కు ఇతర రాష్ర్టాల విద్యార్థులు సైతం హాజరై ఉత్తమ ఫలితాలను సాధించారు. జాతీయ స్థాయిలో విద్యార్థుల కోసం నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా (ఎన్ఐక్యూ) 297 మంది, నాన్లోకల్ కింద 732 మంది ఉత్తీర్ణులయ్యారు.