హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ ) : ఎంసెట్ ప్రశ్నలపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. తొలిసారిగా ఆన్లైన్ పరీక్ష ప్రశాంతంగా రాసినట్టు విద్యార్థులు వెల్లడించారు. మొత్తం ప్రశ్నల్లో కెమిస్ట్రీ తేలికగా ఉన్నదని, ఫిజిక్స్ మధ్యస్తంగా వచ్చిందని పేర్కొన్నారు. కాగా, గణితంలో ప్రశ్నల నిడివి సుదీర్ఘంగా, పొడవుగా ఉండటంతో విద్యార్థులు అర్థం చేసుకోలేకపోయారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ సోమవారం ఏపీ, తెలంగాణలో సజావుగా నిర్వహించారు. తొలిరోజు ఈ రెండు రాష్ర్టాల్లో కలిపి 91.04 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణలో 89, ఏపీలో19 పరీక్షా కేంద్రాల చొప్పున పరీక్షలు నిర్వహించారు.
మొత్తం రెండు రాష్ర్టాల్లో 58,548 మంది విద్యార్థులకు 53,509 మంది విద్యార్థులు (91.4శాతం) పరీక్షలు రాసినట్టు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్ తెలిపారు. సమస్యాత్మకంగా భావించిన వరద బాధిత ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ 93 శాతం మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్టు వెల్లడించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సజావుగా పరీక్షలు నిర్వహించామని లింబాద్రి పేర్కొన్నారు.
తెలంగాణలో భారీగా హాజరు
ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో నిర్వహించిన ఈ పరీక్షకు తెలంగాణలో 94.8శాతం మంది హాజరయ్యారు. రాష్ట్రంలో 46,571 విద్యార్థులకుగాను 44,169 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఏపీలో హాజరు శాతం తక్కువగా నమోదైంది. ఏపీలో 11,977 మంది విద్యార్థులకు 9,340 (78.0శాతం) మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో అత్యధికంగా 99.4శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్టు అధికారులు వెల్లడించారు. మంగళ, బుధవారం పరీక్షలు కొనసాగనున్నాయి.