హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా ప్రభావం చాలావరకు తగ్గింది. ఫిబ్రవరి నెలలో పాజిటివ్ కేసులు ఏకంగా 90 శాతం తగ్గిపోయాయి. ఒమిక్రాన్ ఊహించినంత తీవ్రంగా ప్రభావం చూపలేదు. దీంతో ఫిబ్రవరి మొదటి వారం నుంచే కేసుల సంఖ్య వేగంగా పడిపోవడం మొదలైంది. మూడు వారాల్లో కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. యాక్టివ్ కేసులు సైతం 90 శాతం తగ్గడం విశేషం. పాజిటివిటీ పూర్తిగా అదుపులోకి వచ్చి రికవరీ రేటు గణనీయంగా పెరిగింది. మొదటి, రెండు వేవ్లతో పోల్చితే థర్డ్ వేవ్ ఆర్థిక కార్యకలాపాలపై పెద్దగా ప్రభావం చూపలేదు. సంక్రాంతి తర్వాత ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగాయి. ఆ తర్వాత తగ్గడం మొదలైంది. అప్పటి నుంచే అన్ని రకాల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. పరిశ్రమలకు ఊరట కలిగింది. ముఖ్యంగా ఐటీ కంపెనీలకు భరోసా వచ్చింది. అనేక కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్కు స్వస్తి పలుకుతున్నాయి. రెండేండ్ల తర్వాత ఉద్యోగులు తిరిగి ఆఫీస్కు వస్తున్నారు.