హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు పల్లెవాసులు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. గ్రామాల్లో పన్నులను ఠంచన్గా చెల్లిస్తూ.. తమ ఊళ్ల అభివృద్ధికి తమవంతు బాధ్యత నిర్వర్తిస్తున్నారు. ఫలితంగా రికార్డుస్థాయిలో పన్ను వసూళ్లు జరుగుతున్నాయి. దాంతో పల్లెప్రగతితో గ్రామ పంచాయతీలు అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నాయి. పంచాయతీ ప్రజలకు కావాల్సిన మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 90% పన్ను వసూలైంది. వందశాతం వసూళ్లతో మూడు జిల్లాలు రికార్డు సృష్టించాయి. గతంలో గ్రామాల పరిస్థితి, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా వంటివన్నీ అధ్వాన్నంగా ఉండటంతో పన్నులు చెల్లించేందుకు యజమానులు ముందుకు రాకపోయేవారు. సౌకర్యాలు కల్పించలేని పాలకవర్గాలు పన్ను వసూళ్లలోనూ పారదర్శకంగా వ్యవహరించకపోయేవి. కానీ, తెలంగాణ ప్రభుత్వం పల్లెప్రగతి చేపట్టాక గ్రామాల్లో వచ్చిన మార్పులతో యజమానులు ఇంటి పన్ను చెల్లించడానికి స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. పంచాయతీ పాలకవర్గాలు కూడా వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాయి. పన్ను చెల్లింపుపై అవగాహన, చైతన్యం కల్పిస్తున్నాయి. దీంతో గ్రామాల్లో పన్ను చెల్లింపుదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.288.14 కోట్ల ఇంటిపన్ను వసూలును ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నది. రూ.260.64 కోట్లు వసూలయ్యాయి. రూ.27.50 కోట్లు మాత్రమే బకాయిలున్నాయి. వనపర్తి, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో వందశాతం ఇంటి పన్ను వసూలైంది. ఏడు జిల్లాల్లో 95 శాతానికి పైగా వసూళ్లయ్యాయి. 11 జిల్లాలు 90% లోపు చెల్లించారు. గ్రామాల్లోనూ ఇంటిపన్నును ఆన్లైన్లో చెల్లించేలా కొత్త విధానాన్ని తీసుకురావడం మంచి ఫలితాన్ని ఇచ్చింది.
జిల్లా గ్రామాలు వసూలైంది శాతం
(రూ.కోట్లలో)
వనపర్తి 255 2.31 100
కామారెడ్డి 526 9.41 100
జగిత్యాల 380 6.94 100
నిర్మల్ 396 6.45 99.47
పెద్దపల్లి 266 5.55 99.36