హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ఇటీవల కురిసిన భారీ వర్షాల నుంచి పంటలు క్రమంగా తేరుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సాగు కూడా క్రమంగా పెరుగుతున్నది. బుధవారంవరకు రాష్ట్ర వ్యాప్తంగా 89.88 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ పేర్కొన్నది. 47.59 లక్షల ఎకరాల్లో పత్తి, 23.91 లక్షల ఎకరాల్లో వరి సాగు అయింది. 5.37 లక్షల ఎకరాల్లో కంది, 4.55 లక్షల ఎకరాల్లో మక్కజొన్న, 3.77 లక్షల ఎకరాల్లో సోయాబీన్ పంటలు సాగయ్యాయి. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది పంటల సాగు భారీగా తగ్గడం గమనార్హం.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. నెల రోజుల నుంచి వర్షాలు ఏకధాటిగా కురుస్తుండటంతో సాగుకు ఆటంకం కలుగుతున్నది. నిరుడు ఇదే సమయానికి 1.03 కోట్ల ఎకరాలకు పైగా సాగైంది. అంటే 14 లక్షల ఎకరాల్లో వరకు సాగు తగ్గింది. ప్రస్తుత సీజన్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మెదక్, మహబూబాబాద్ జిల్లాల్లో నిర్దేశిత లక్ష్యంలో 100 శాతానికి పైగా సాగు పూర్తయింది. ఆదిలాబాద్ జిల్లాలో 105 శాతం సాగు పూర్తికావడం గమనార్హం. నిజామాబాద్లో 94% వరంగల్, సిద్దిపేట, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లో 70శాతం లోపే సాగు పూర్తయింది. ఈ జిల్లాల్లో ఈ నెలలో వరిసాగు పెరిగే అవకాశమున్నది.
పంటలకు ఉపయోగించే నాలుగు రకాల పురుగుల మందులపై రాష్ట్ర వ్యవసాయశాఖ నిషేధం విధించింది. ల్యాబ్లో నిర్వహించిన నాణ్యత పరీక్షలో ఇవి నాసిరకంగా తేలినట్టు తెలిపింది. ఆ నాలుగు రకాల పురుగుల మందులను వినియోగించొద్దని రైతులను, విక్రయించొద్దని వ్యాపారులను ఆదేశించింది.