హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ కోరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. హైదరాబాద్ బీఆర్కే భవన్లో బుధవారం ఆయన అధ్యక్షతన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కోడ్ ఉల్లంఘన, ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై పార్టీల ప్రతినిధులకు సీఈవో వివరించారు. సమావేశానికి బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కే వాసుదేవరెడ్డి హాజరయ్యారు. వాసుదేవరెడ్డి మాట్లాడుతూ వేసవిలో ఎన్నికలు జరుగుతున్నందున ఓటర్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, కుటుంబ సభ్యుల ఓట్లు ఒకే పోలింగ్స్టేషన్లో ఉండేలా చూడాలని, ఒకటే పేరుతో రెండు రాష్ట్రాల్లో ఉన్న ఓట్లను సరిదిద్దాలని, అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలపై చేస్తున్న భౌతిక దాడులను అరికట్టాలని కోరినట్టు తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకే అడ్రెస్పై 55 వేల ఓట్లు ఉన్నాయని తెలిపినట్టు బీజేపీ నేత మర్రి శశిధర్రెడ్డి చెప్పారు. తెలంగాణలో ఉన్న 9 లక్షల డూప్లికేట్ ఓట్లను తొలగించాలని కోరినట్టు తెలిపారు. సమావేశంలో అడిషనల్ సీఈ వో లోకేశ్కుమార్, జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.