హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. టీఎస్పీఎస్సీ ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. అసిస్టెంట్ ఇంజినీరింగ్ పరీక్ష కూడా లీకైందని గుర్తించామని, దాంతో పాటు గతంలో నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను ఏమైనా లీక్ చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాస్తవానికి మొదట టీఎస్పీఎస్సీ సర్వర్ హ్యాకింగ్కు గురై ప్రశ్నపత్రాలు లీకైనట్లు అధికారులు భావించారు. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్న అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్, ఔట్ సోర్సింగ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్రెడ్డి ప్రశ్నాపత్రాలను దొంగిలించినట్లుగా గుర్తించారు. రేణుక, ఆమె భర్త ఢాక్యా నాయక్లతో కుదిరిన ఒప్పందం మేరకు ప్రశ్నపత్రాలను దొంగిలించారని, వీరిని నలుగురు వ్యక్తులు వాటిని కొనుగోలు చేసినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. ఇందులో వ్యవహారంలో తొమ్మిది మందిని అరెస్టు చేశామని, రిమాండ్కు తరలించినట్లు వివరించారు.
టీఎస్పీఎస్సీలో ప్రవీణ్కుమార్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా పని చేస్తుండగా.. అతనికి రేణుఖ మహిళతో స్నేహం ఉంది. రేణుక ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది. ఈ క్రమంలోనే అసిస్టెంట్ ఇంజినీరింగ్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం కావాలని ప్రవీణ్ను రేణుక కోరింది. రూ.10లక్షలు ఇస్తామంటూ భర్త భర్త ఢాక్యా నాయక్తో కలిసి డీల్ కుదుర్చుకుంది. దాంతో ప్రవీణ్ టీఎస్పీఎస్సీలో నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్గా పని చేస్తున్న రాజశేఖర్రెడ్డి సహాయాన్ని కోరాడు.
ఆ తర్వాత ఇద్దరు కలిసి టీఎస్పీఎస్సీ సర్వర్లో ఉన్న పాస్వర్డ్ యాక్సెస్ చేసి.. పెన్డ్రైవ్లో వాటిని కాపీ చేసి రేణుకకు ఇచ్చి ఆమె వద్ద నుంచి రూ.10లక్షలు వసూలు చేశాడు. ఆ తర్వాత అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షలకు సన్నద్ధమవుతోన్న అభ్యర్థులను సంప్రదించి దాదాపు రూ.13లక్షలకుపైగా సేకరించారు. వీరంతా రేణుక ఇంట్లోనే ప్రశ్నలపై అధ్యయనం చేసి సమాధానాలను సైతం సేకరించుకొని.. మార్చి 5న అసిస్టెంట్ ఇంజినీరింగ్ పరీక్షకు హాజరయ్యారు. ఈ తతంగం మొత్తం ఎవరికీ అనుమానం పూర్తికావడంతో తర్వాత.. రేణుక తన సోదరుడి కోసం అంటూ టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ఓవర్సీర్ ప్రశ్నాపత్రం కోసం ప్రవీణ్ను సంప్రదించింది.
ప్రశ్నాపత్రం దొరికే అవకాశం ఉండడంతో ఆమె పరీక్ష రాసేందుకు సిద్ధమైన అభ్యర్థితో పాటు ఓ గ్రామ సర్పంచ్ కొడుకుతో బేరసారాలు నడిపారు. ప్రశ్నాపత్రం దొరికే అవకాశం ఉండడంతో పలువురు అభ్యర్థుల నుంచి రూ.14లక్షల వరకు రేణుక వసూలు చేసింది. ఇందులో రూ.10లక్షలకు ఇచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలిసిన ఓ అభ్యర్థి డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దాంతో పోలీసులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులను సంప్రదించగా.. లీకేజీ వ్యవహారం వెలుగు చూసింది. టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలకు సంబంధించి పేపర్లు లీక్ అయ్యాయన్న అనుమానంతో టీఎస్పీఎస్సీ ఫిర్యాదు చేసిందని, మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష పేపర్లు కూడా లీకయ్యాయని విచారణలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితులు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారని, వారి నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని వివరించారు. ప్రవీణ్ సెల్ ఫోన్, ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్లు స్వాధీనం చేసుకున్నామని, గతంలో జరిగిన పరీక్షల పేపర్లేమైనా లీక్ చేశారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన పీఏ ప్రవీణ్.. కారుణ్య నియామకం కింద జూనియర్ అసిస్టెంట్గా నియామకమయ్యాడు. అనంతరం ఉద్యోగోన్నతి లభించింది. గతంలో పని చేసిన విభాగాన్ని ప్రభుత్వం మూసివేయడంతో టీఎస్పీఎస్సీకి వచ్చాడు. గత నాలుగేళ్లుగా ఇక్కడే పని చేస్తున్నాడని పోలీసులు వివరించారు.