(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ‘సర్’ను ఓ రాజకీయ ఆయుధంగా ప్రయోగిస్తున్నారని, తాము అధికారంలో ఉండగా ఇలాంటి ఆటలు సాగబోవని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గత నవంబర్లో నిప్పులు చెరిగారు. ‘సర్’కు ముందు ఇలా ఎన్నో ప్రకటనలు చేసిన ఆయన.. తీరా ‘సర్’ ప్రక్రియ మొదలుకాగానే పట్టించుకోవడం మానేశారు. ఫలితం.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఎన్నెన్నో ప్రవేశపెట్టినప్పటికీ, డీఎంకే అధికారానికి దూరమైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కార్యకర్తల అంతర్గత సమావేశంలో స్టాలిన్ మాట్లాడుతూ.. ‘సర్’ను నిర్లక్ష్యం చేయాల్సింది కాదని పేర్కొనడం గమనార్హం. దీంతో తెలంగాణలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై అన్ని పార్టీలు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయి.
‘సర్’తో రికార్డ్ పోలింగ్
తమిళనాడులో ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 85.1% పోలింగ్ నమోదైంది. 2021 ఎన్నికల్లో నమోదైన 73.6 శాతంతో పోలిస్తే ఇది 11.5% ఎక్కువ. దీనికి ప్రధాన కారణం 2025 చివరిలో ఆ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ‘సర్’ ప్రక్రియేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సాధారణ అప్డేట్ల మాదిరిగా కాకుండా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ధృవీకరించుకోవడంతో ఓటర్ జాబితాలో భారీ ప్రక్షాళన జరిగిందని అంటున్నారు. మరణించినవారు, నకిలీలు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారితో కలిపి ‘సర్’ ప్రక్రియలో సుమారు 97 లక్షల పేర్లు ఓటర్ జాబితా నుంచి తొలగింపునకు గురయ్యాయని, దీంతో ఓటర్ల సంఖ్య 6.7 కోట్ల నుంచి 5.73 కోట్లకు తగ్గిందని గుర్తుచేస్తున్నారు. ఓటర్ల సంఖ్య తగ్గడంతో సహజంగానే ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. ఓటర్ల సంఖ్య తగ్గింపు, భారీ ఓటింగ్ శాతం నమోదవ్వడం రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించి టీవీకే కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు వీలు కల్పించాయని విశ్లేషకులు చెప్తున్నారు.
మంత్రులూ ఓడారు
‘సర్’ ప్రక్రియపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమిళనాడులో డీఎంకే అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో 133 సీట్లను గెలుచుకొన్న స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి ఇటీవలి ఎన్నికల్లో 74 స్థానాలకు పరిమితమైంది. స్టాలిన్ ప్రభుత్వ మంత్రివర్గంలోని 32 మంది మంత్రుల్లో 15 మంది మంత్రులు ఓడిపోవడానికి ఒక్కో నియోజకవర్గంలో తొలగించిన 5 వేల నుంచి 10 వేల ఓట్లే కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అంతేకాదు, ఉత్తర తమిళనాడులోని 69 స్థానాల్లో 30కి పైగా స్థానాలు, పశ్చిమ తమిళనాడులోని 20కి పైగా స్థానాలను 10 వేలలోపు ఓట్ల తే డాతో డీఎంకే చేజార్చుకొన్నదని గుర్తుచేస్తున్నారు. ‘సర్’ ప్రక్రియపై అప్రమత్తంగా ఉంటే, డీఎంకే సులభంగా అధికారంలోకి వచ్చేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.