హైదరాబాద్ : రాష్ట్రంలో వచ్చే నెల 1 నుంచి విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలిసింది. 8వ తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధన నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రత్యక్ష తరగతుల నిర్వహణ అంశంపై శుక్రవారం సీఎం కేసీఆర్కు విద్యాశాఖ ఉన్నతాధికారులు నివేదిక సమర్పించినట్లు తెలిసింది. కరోనాతో విద్యార్థులకు పెద్దగా ప్రమాదం ఉండబోదని విద్యాశాఖ తన నివేదికలో పేర్కొంది. ప్రత్యక్ష తరగతుల బోధన అంశంపై ఈ సాయంత్రానికి లేదా రేపు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం.. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పాఠశాలలు తెరుచుకోవడంతో తెలంగాణ సర్కారు సైతం కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు పచ్చ జెండా ఊపే అవకాశాలున్నాయి.