ములుగు, జూలై 26 (నమస్తే తెలంగాణ)/వెంకటాపురం(నూగూరు): ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండలం వీరభద్రవరం గ్రామ సమీపంలో అటవీప్రాంతంలో బుధవారం రాత్రి 84 మంది పర్యాటకులు వరదలో చిక్కుకున్నారు. జలపాతాలను చూసి తిరిగి వస్తున్న క్రమంలో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి సుమారు వారు అడవిలో చిక్కుకు పోయినట్టు పోలీసులకు సమాచారం అందింది. ములుగు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం బాధితులతో ఫోన్లో మాట్లాడారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపారు. పర్యాటకులంతా హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి 12 కార్లు, 10ద్విచక్ర వాహనాలపై నుంచి పర్యాటకులు బొగత జలపాతాన్ని చూసేందుకు వచ్చారు.