నెలరోజుల్లో 1.07 లక్షల రిజిస్ట్రేషన్లు
87 వేలకుపైగా వ్యవసాయ భూముల లావాదేవీలు
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భూమి విలువలను సవరించిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ల జోరు కొనసాగింది. కొత్తచార్జీలు గత నెల 22వ తేదీ నుంచి అమల్లోకి రాగా, ఈ నెల 22 వరకు వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు సగటు స్థాయిలోనే కొనసాగాయి. నెల రోజుల్లో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ.812 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా గండిపేట సబ్రిజిస్ట్రార్ పరిధిలో రూ.112 కోట్ల ఆదాయం రాగా, రంగారెడ్డి ఎస్ఆర్వోలో రూ.78 కోట్లు, సంగారెడ్డిలో రూ.58 కోట్లు, కుత్బుల్లాపూర్లో రూ.45 కోట్లు, బంజారాహిల్స్లో రూ.41 కోట్లు వచ్చాయి. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూములకు సంబంధించి నెలరోజుల్లో 87,632 లావాదేవీలు జరిగాయి. వీటిద్వారా రూ.200 కోట్లకుపైగా ఆదాయం సమకూరినట్టు తెలిసింది. జూలై 22-ఆగస్టు 22 తేదీల మధ్య వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు 1,07,900 నమోదయ్యాయి. అత్యధికంగా సంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ పరిధిలో 4,329 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. 3 వేల రిజిస్ట్రేషన్లతో కుత్బుల్లాపూర్ రెండోస్థానంలో, 2,800 రిజిస్ట్రేషన్లతో వరంగల్ మూడో స్థానంలో నిలిచాయి.
స్వల్ప తగ్గుదల
జూలై 22-ఆగస్టు 22 మధ్య రిజిస్ట్రేషన్లలో స్వల్ప తగ్గుదల నమోదైంది. రిజిస్ట్రేషన్ చార్జీలు సవరిస్తారన్న అంచనాల నేపథ్యంలో చాలామంది ముందుగానే లావాదేవీలను పూర్తిచేసుకున్నారు. దీంతో జూన్ చివరివారం నుంచే రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరగడం మొదలైంది. దీంతో సవరించిన తర్వాత సంఖ్య కాస్త తగ్గిందని, ఇది నామమాత్రమేనని అధికారులు తెలిపారు. అదే సమయంలో చార్జీలు సవరించిన నేపథ్యంలో ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరిగిందన్నారు.