హైదరాబాద్, జనవరి 26(నమస్తే తెలంగాణ): రథసప్తమిని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం శనివారం రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు టీఎస్ ఆర్టీసీ 80 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సహా జిల్లా కేంద్రాల నుంచి వేములవాడ, ధర్మపురి, యాదగిరిగుట్ట, మన్నెంకొండ, గూడెం తదితర ఆలయాలకు ఈ ప్రత్యేక బస్సులను నడుపనున్నది. కరీంనగర్ నుంచి వేములవాడకు 10, ధర్మపురికి 10, నల్లగొండ నుంచి యాదగిరిగుట్టకు 10, మహబూబ్నగర్ నుంచి మన్యంకొండకు 10, ఆదిలాబాద్ నుంచి గూడెంకు 5, హైదరాబాద్ కేపీహెచ్బీ నుంచి అనంతగిరికి 5 ప్రత్యేక బస్సులను టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి, చిలుకూరు బాలాజీ, సికింద్రాబాద్ మహంకాళి, హిమాయత్ నగర్ బాలాజీ తదితర ఆలయాలకు ప్రధాన ప్రాంతాల నుంచి 30 ప్రత్యేక బస్సులను నడుపనున్నది.
అవసరమైతే మరికొన్ని బస్సులు : ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, ఎండీ సజ్జనార్
రథసప్తమి సందర్భంగా భక్తులు సురక్షితంగా ఆలయాలకు చేరుకునేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నామని టీఎస్ ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ ఎడీ సజ్జనార్ తెలిపారు. భక్తుల రద్దీ మేరకు అవసరమైతే మరికొన్ని బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. వసంత పంచమి సందర్భంగా గురువారం పుణ్యక్షేత్రాలైన బాసర, వర్గల్కు 108 బస్సులను ఏర్పాటు
చేసినట్టు తెలిపారు.