హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): దసరా నాటికి సచివాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే కాంక్రీట్ పనులు 80 శాతం పూర్తయ్యాయి. మిగిలిన 20 శాతం పనులు నెల రోజుల్లోగా పూర్తవుతాయని అధికారులు చెప్తున్నారు. కాంక్రీట్ పనులతో సమాంతరంగా ఎలక్ట్రిక్, ఫ్లోరింగ్, టైల్స్ వేయడం తదితర పనులన్నీ ఒకేసారి పూర్తయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతేడాది అక్టోబర్లో సచివాలయ నిర్మాణ పనులను షాపూర్జీ పల్లోంజీ సంస్థ దక్కించుకున్నది. ఏడాదిలో నిర్మాణం పూర్తి చేయాలన్నది ఒప్పందం. కరోనా సెకండ్ వేవ్ కారణంగా తొలుత పనుల్లో కొంత జాప్యం జరిగినప్పటికీ, వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. ప్రతిరోజూ దాదాపు రెండువేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. గురువారం సచివాలయ నిర్మాణ పనులను తనిఖీ చేసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పలు గ్రానైట్స్, టైల్స్ డిజైన్లకు ఆమోదం తెలిపినట్టు రోడ్లు, భవనాలశాఖ ఈఎన్సీ గణపతిరెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఎంపిక చేసిన మోడల్స్ ఆధారంగా నమూనాలు తయారుచేయించి, వాటిని మరోసారి ముఖ్యమంత్రికి చూపించిన తరువాత సమాంతర పనులు చేపట్టాలన్నది అధికారుల ఆలోచన.