హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): మునగ చెట్టుకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ప్రతి ఇంటికో మొక్కను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హరితహారం సందర్భంగా పంపిణీ చేసే మొక్కల్లో ఇంటికి ఒక మునగ మొక్క ఉండేలా చర్యలు తీసుకొంటున్నారు. ఇప్పటికే అవసరమైన మొక్కలను రాష్ట్రంలోని అన్ని నర్సరీల్లో సిద్ధం చేశారు. ఇందులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 8.76 కోట్లు, మున్సిపల్ శాఖ ద్వారా 7.32 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించారు. మున్సిపల్ శాఖ పంపిణీ చేసే వాటిల్లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో కాకుండా 141 మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో 2.50 కోట్లకు పైగా మొక్కలను నాటనున్నారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో ఇంటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేస్తారు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా మూడున్నర కోట్ల మొక్కలను పంపిణీ చేస్తారు. దీనిలో 80 లక్షల మునగ మొక్కలున్నాయి. ఇంటింటికీ పంపిణీ చేసే మొక్కల్లో కచ్చితంగా మునగ మొక్కను ఇస్తారు.
మునగలో ఔషధ గుణాలు బోలెడు
మునగ చెట్టు లోని ప్రతి భాగం ఉపయోగపడుతుందని శాస్త్రీయంగా విశ్లేషించారు. మునగ ఆకు, మునగ కాయలు, మునగ విత్తనాలు, మునగ బెరడు, ఇలా ప్రతి భాగం ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుందని, దీని పెంపకాన్ని ప్రోత్సహించాలని, ప్రజల్లో అవగాహన పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది. మునగ తక్కువ కాలంలో ఎదుగుతుంది. కాయలు తక్కువ కాలంలోనే కాస్తాయి. మునగలో విటమిన్ సీ, మాంసకృత్తులు, ఐరన్, పొటాషియం అధికంగా ఉంటాయి. ఆకుల్ని ఎండబెట్టి పొడిగా చేసి సూప్లు, సాస్లలో ఉపయోగిస్తారు. మునగ విత్తనాల్లో 40 శాతం వంట నూనె ఉంటుంది. నూనె తీసిన తర్వాత పిప్పిని ఎరువుగా వాడుతారు.