హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): కేంద్రం ఆర్థికంగా అస్థిర పరిచేందుకు ప్రయత్నిస్తున్నా, తెలంగాణ మాత్రం సొంతకాళ్లపై నిలబడుతూ ఆర్థిక వృద్ధిని సాధిస్తున్నది. ఏ లక్ష్యంతోనైతే రాష్ర్టాన్ని సాధించుకున్నామో.. ఆ దిశగా తెలంగాణ అడుగులేస్తున్నది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నేతృత్వంలో పటిష్ఠమైన ఆర్థిక పునాదులతో నిలదొక్కుకుంటూ సంపదను సృష్టించుకుంటున్నది. బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధికి తొలి ప్రాధాన్యమిస్తున్నది. రాబడుల్లో అత్యధిక మొత్తాన్ని రాష్ర్టాభివృద్ధికి ఖర్చు చేస్తుండటంతో ఆర్థికంగా తెలంగాణ రోజురోజుకూ మరింత బలపడుతున్నది. ప్రజల ఆదాయాన్ని పెంచడం ద్వారా రాబడిలో వృద్ధిరేటును నమోదు చేసుకోవడంలో తెలంగాణ సక్సెస్ అయ్యింది.
ఒకవైపు అప్పులను కట్టడి చేస్తూనే, మరోవైపు రాబడిని పెంచుకోవడంలో దేశానికే రోల్మాడల్గా నిలుస్తున్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా నివేదిక ప్రకారం దేశంలో అభివృద్ధి కోసం అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్ మొదటి నాలుగు స్థానాల్లో ఉండగా తెలంగాణ ఐదో స్థానంలో ఉన్నది. భౌగోళికంగా, జనాభాపరంగా ఆ నాలుగు రాష్ర్టాలు ఎంతో పెద్దవైనప్పటికీ వాటితో పోటీ పడుతూ అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణ నిధులను ఖర్చు చేస్తున్నది.
ఏటేటా పెరుగుతున్న కేటాయింపులు
బడ్జెట్ కేటాయింపుల్లో అభివృద్ధి వ్యయానికే రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నది. దేశంలో గత రెండేండ్లుగా బడ్జెట్లో అభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయించిన రాష్ర్టాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలోని మొత్తం రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్లో 77.4% నిధులు (రూ.1.98 లక్షల కోట్లు) అభివృద్ధి వ్యయానికి కేటాయించింది. 2021-22లో ఈ కేటాయింపులు 76.3 శాతంగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 69.7 శాతంగా ఉన్నాయి. 2020-21లో రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.67,963 కోట్ల రాబడి వచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1,09,992 కోట్లకు ఎగబాకింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లోని తొలి 9 నెలల్లోనే రూ.లక్ష కోట్లకుపైగా రాబడిని సాధించింది. ఏడాది క్రితం నాటి రాబడి కంటే ఇది 19% అధికం. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 3 నెలలు పూర్తయ్యే నాటికి మొత్తంగా రూ.1.27 లక్షల కోట్ల రాబడి వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేస్తున్నది. ఇలా వచ్చిన రాబడిని మళ్లీ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు వెచ్చిస్తూ ఏటికేడు ఆర్థిక వృద్ధిని సాధిస్తున్నది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో..మొత్తం బడ్జెట్ రూ.2.56 లక్షల కోట్లు అభివృద్ధి వ్యయం రూ.1.98 లక్షల కోట్లు అభివృద్ధి వ్యయానికి కేటాయింపులు
2020-21 ఆర్థిక సంవత్సరంలో 69.7%
2021-22 ఆర్థిక సంవత్సరంలో 76.3%
2022-23 ఆర్థిక సంవత్సరంలో 77.4%