హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రైతుబంధు 8వ విడత నిధులు మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. తొలిరోజు ఎకరం వరకు వ్యవసాయ భూమి ఉన్నవారికి జమచేస్తారు. గతంలో మాదిరిగానే రోజుకొక ఎకరం చొప్పున పెంచుకొంటూ, పది రోజుల్లో పంపిణీ పూర్తి చేస్తారు. ఈ యాసంగి పంట పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.7,645.66 కోట్లు విడుదల చేసింది. ఈ సీజన్లో 66,61,638 మంది రైతులకు లబ్ధి చేకూరనున్నది. మొత్తం కోటి 52 లక్షల 91 ఎకరాలకు రైతుబంధు వర్తించనున్నది. డిసెంబర్ 10వ తేదీ నాటికి ధరణి పోర్టల్లో నమోదైన పట్టాదారులతోపాటు ఆర్ఎఫ్వోఆర్ పట్టాదారులకు కూడా 8వ విడత రైతుబంధు అందనున్నది. ఇప్పటివరకు ప్రభుత్వం ఏడు విడుతల్లో కలిపి రైతుల ఖాతాల్లో రూ.43,036.63 కోట్లు జమచేసింది. 8వ విడతతో ఈ మొత్తం రూ.50 వేల కోట్లు దాటనున్నది. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయిన వెంటనే వారి రిజిస్టర్డ్ ఫోన్లకు మెస్సేజ్ పంపిస్తారు.