హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడంతో పాటు.. భూమి మీద పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరిగింది. గడిచిన కొన్నేండ్ల ట్రెండ్స్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత ఎనిమిదేండ్లలో ఓపెన్ ప్లాట్లు, ఫ్లాట్ల క్రయవిక్రయాలు భారీగా పెరిగాయి. భవిష్యత్తు అవసరాలు, పెట్టుబడుల దృష్ట్యా చాలామంది ఈ రెండు క్యాటగిరీలకే ఎక్కుక ప్రాధాన్యం ఇస్తున్నట్టు తేలింది. గత ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖకు మొత్తం రూ.10,997 కోట్ల ఆదాయం లభించగా ఇందులో రూ.7,560 కోట్లకుపైగా ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్లు, ఇండ్ల క్రయ, విక్రయాల ద్వారానే లభించింది. వ్యవసాయ భూముల క్రయ, విక్రయాల ద్వారా రూ.1,534 కోట్ల ఆదాయం సమకూరగా, గిఫ్ట్ డీడ్లు, సెటిల్మెంట్లు, ఇతర మార్గాల ద్వారా మిగిలిన మొత్తం వచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో జరిగిన క్రయ విక్రయాల్లో వ్యవసాయ భూముల వాటా 44.94% ఉండగా, ఓపెన్ ప్లాట్ల వాటా 40.94% ఉన్నది. ఇండ్లు 7.93%, ఫ్లాట్లు 6.49%తో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. స్టాంపులు రిజిస్ట్రేషన్లశాఖ విడుదల చేసిన వార్షిక నివేదికలోని గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
నాలుగు రెట్లు పెరిగిన ఆదాయం
రాష్ట్రంలో గడిచిన ఎనిమిదేండ్లలో ఫ్లాట్ల క్రయ, విక్రయాలు నాలుగురెట్లు పెరిగాయి. 2014-15లో 41 వేల రిజిస్ట్రేషన్లు జరుగగా వాటి ద్వారా ప్రభుత్వానికి రూ.654.55 కోట్ల ఆదాయం సమకూరింది. 2018-19 నాటికి ఫ్లాట్ల క్రయ, విక్రయాల ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖకు వచ్చిన ఆదాయం రూ.1,300 కోట్ల మార్క్ను దాటింది. 2021-22 నాటికి 87 వేల రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.2,800 కోట్లు దాటిపోయింది. ఇండ్ల క్రయ, విక్రయాల ద్వారా 2014-15లో రూ.606.15 కోట్ల ఆదాయం రాగా, 2021-22లో రూ.2,135.80 కోట్లు సమకూరాయి. ఇదే సమయంలో ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.484.99 కోట్ల నుంచి రూ.2,582.93 కోట్లకు పెరిగింది.