Telangana | హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో భారీగా నగదు, మద్యం పట్టుబడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 148 చెక్పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లాలు, మండలాల సరిహద్దుల్లో నిర్వహిస్తున్న తనిఖీల ద్వారా శనివారం రాత్రి వరకు రూ.74,95,31,197 విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, బంగారు, వెండి ఆభరణాలు, ఇతర సామగ్రి పట్టుబడింది.
తనిఖీలు ప్రారంభించిన నాటి నుంచి 14వ తేదీ రాత్రి వరకు సుమారు రూ.48,32,99,968 నగదు పట్టుబడింది. రాష్ట్ర సరిహద్దులో పోలీసు, రవాణాశాఖ, కమర్షియల్ టాక్స్, ఎక్సైజ్, అటవీశాఖలు ఏర్పాటు చేసిన చెక్పోస్టులతో పాటుగా.. ఆయా జిల్లా కేంద్రాలు, సరిహద్దులు, మండల కేంద్రాల్లో నిత్యం నిర్వహిస్తున్న తనిఖీలో భారీగా నగదు, మద్యం పట్టుబడుతున్నాయి. ఈ తనిఖీల ద్వారా రూ. 17,50,02,116 విలువైన వజ్రాలు, బంగారు, వెండి నగలు, ఇతర ఆభరణాలు పట్టుబడటం విశేషం. ఎన్నికల సంఘం ఆదేశాలమేరకు తనిఖీ బృందాలు క్రియాశీలకంగా విధులు నిర్వర్తిస్తున్నాయి.