హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. కొత్త పోస్టులను సృష్టించింది. రోడ్లకు పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చే అధికారాన్ని అధికారులకు కట్టబెట్టింది. క్షేత్రస్థాయిలో వాస్తవ పనులకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది ఉండేలా సర్కారు చర్యలు చేపట్టింది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించడం వల్ల కొత్తగా 740 పోస్టులు క్రియేట్ కానున్నాయి. జిల్లాల్లో పనుల పర్యవేక్షణకు నాలుగు చీఫ్ ఇంజినీర్ పోస్టులను మంజూరు చేశారు. 12 సూపరింటెండెంట్ ఇంజినీర్, 11 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, 60 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయాలు, పోస్టులను మంజూరు చేశారు. వీటితో అనేక మంది అధికారులకు పదోన్నతులు రానున్నాయి. ఇంజినీర్లు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరింది.
ఉద్యోగుల సంబురాలు
పీఆర్ ఇంజినీరింగ్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించడంపై ఎర్రమంజిల్లోని పీఆర్ ఈఎన్సీ సంజీవరావు నేతృత్వంలో అధికారులు, ఉద్యోగులు మంగళవారం సంబురాలు జరుపుకొన్నారు. పటాకులు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. ఇంజినీరింగ్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ వచ్చిన్నాడు ఎంత సంతోషంగా ఉన్నామో ఈ రోజు అంతే సంతోషంగా ఉన్నామని పీఆర్ ఇంజినీర్లు, ఉద్యోగులు ప్రకటించారు. ఇందుకు సహకరించిన మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పీఆర్ ఇంజినీరింగ్ విభాగం సీఈ సీతారాములు, పీఆర్ ఇంజినీర్ అసోసియేషన్ నాయకులు ముజీబ్, ఎస్ సంజీవరెడ్డి, అబ్బు శ్రీనివాస్, భూమన్న, నరేంద్రప్రసాద్, ఇంజినీరింగ్ అధికారులు చంద్రమౌళి, అశోక్, శ్రీహరి, రమేశ్ చంద్ర, సురేశ్ చంద్రారెడ్డి, నరేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్కు పీఆర్ ఇంజినీర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు
పీఆర్ ఇంజినీర్ విభాగం పునర్వ్యవస్థీకరణకు ఆమోదముద్ర వేసిన సీఎం కేసీఆర్కు తెలంగాణ పంచాయతీరాజ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. పీఆర్ ఇంజినీరింగ్ ఉద్యోగులు, అధికారులు మరింత ఉత్సాహంగా పనిచేసేలా, వారిలో మనోధైర్యాన్ని నింపేవిధంగా నిర్ణయం తీసుకున్నందుకు అసోసియేషన్ అధ్యక్షుడు డీ సూర్యప్రకాశ్, ప్రధాన కార్యదర్శి జీ వెంకట్రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎస్ శ్రీనివాస్రెడ్డి, నరేంద్రప్రసాద్ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ప్రజలకు మరింత సేవ చేస్తామని పేర్కొన్నారు.
పరిపాలన అనుమతి అధికారం హర్షణీయం
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులకు రోడ్లకు పరిపాలనానపరమైన అనుమతి ఇచ్చే అధికారాన్ని ప్రభుత్వం కట్టబెట్టింది. ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ (ఎఫ్డీఆర్), క్రాస్ డ్రైనేజ్ (సీడీ) వర్క్స్, అత్యవసర సమయాల్లో పనులు చేపట్టడానికి ఆర్థికపరంగా పరిపాలన అనుమతిచ్చే అధికారాన్ని ఇంజినీరింగ్ అధికారులకు ఇచ్చారు. డీఈఈ నుంచి ఈఎన్సీ వరకు పరిపాలన అనుమతులను ఇకపై ఇవ్వవచ్చు. పనుల్లో జాప్యాన్ని నివారించడానికి క్షేత్రస్థాయి అధికారులకే అనుమతుల అధికారం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. డీఈఈ నుంచి ఈఎన్సీ వరకు ఒక పనికి లక్ష నుంచి 50 లక్షల వరకు పరిపాలన అనుమతులు ఇచ్చే అధికారం కల్పించారు. క్షేత్ర స్థాయి సమస్యల పట్ల అవగాహన ఉన్న సీఎం పరిమితితో ఆర్థికపరమైన అధికారం కల్పించడం పట్ల ఇంజినీరింగ్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.