C. Rangarajan | హైదరాబాద్, సెప్టెంబర్ 27 (స్పెషల్ టాస్క్ బ్యూరో- నమస్తే తెలంగాణ): దేశంలో సామాన్యుల పొదుపు 50 ఏండ్ల కనిష్ఠానికి పడిపోయింది. ఇదే సమయంలో అప్పులు కొండెక్కాయి. ఈ పరిస్థితి కచ్చితంగా ఆందోళన కలిగించే అంశమేనని ఆర్బీఐ మాజీ గవర్నర్, పీఎం ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ మాజీ చైర్మన్ సీ రంగరాజన్, మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ మాజీ డైరెక్టర్, గౌరవ ప్రొఫెసర్ డీకే శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశ ఆర్థికవ్యవస్థ, పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడొచ్చని, ఇదంత మంచి పరిణామం కాదని హెచ్చరించారు.
దేశంలోని కుటుంబాల రుణభారం కేవలం రెండేండ్లలోనే రెట్టింపైందని, ఇదే సమయంలో పొదుపు సగానికి పైగా పడిపోయిందని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఇటీవల ఓ నివేదికలో వెల్లడించింది. 2020-21, 2022-23 ఆర్థిక సంవత్సరానికి కుటుంబాల అప్పులు రెట్టింపునకు పైగా పెరిగి రూ. 15.6 లక్షల కోట్లకు చేరాయని, 2021 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 11.5 శాతంగా ఉన్న కుటుంబాల పొదుపు రెండేండ్లలోనే 55 శాతం మేర తగ్గి 5.1 శాతానికి క్షీణించినట్టు ఈ నివేదిక వివరించింది.