కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 17: దేశంలో ఏటా రెండు పంటలనూ కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. యాసంగి పంట సేకరణకు కేంద్రం మందుకురాకున్నా రైతుల మేలు కోసం రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలుకు సిద్ధమైందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి దిగుబడి ప్రారంభమయ్యే 15 రోజుల మందుగానే ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించామని, రాష్ట్రవ్యాప్తంగా 7,100 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఇప్పటికే 400 సెంటర్లు తెరిచి రూ.4.15 కోట్ల విలువైన 2 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు తెలిపారు.
ఆదివారం ఆయన కరీంనగర్ రూరల్ మండలం చెర్లభూత్కూర్, మొగ్దుంపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం మంత్రి గంగుల మాట్లాడుతూ.. రోజూ 3 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. నాణ్యమైన ధాన్యాన్ని తెచ్చి మద్దతు ధర పొందాలని, దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రాద్ధాంతం చేసేందుకు యత్నించే విపక్ష నాయకులను నిలదీయాలని, వారు పాలిస్తున్న రాష్ట్రల్లో రెండు పంటలను ఎందుకు కొనడంలేదో ప్రశ్నించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి గంగులకు స్వల్పగాయాలు
చెర్లభూత్కూర్లో ఆదివారం చిడతల రామాయణం ప్రదదర్శనలో అపశ్రుతి చోటుచేసుకున్నది. కళాకారులను అభినందించేందుకు మంత్రి గంగుల, పలువురు నాయకులు రావడంతో భారం అధికమై ఆ నాటక వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో మంత్రి కిందకు తూలి పడటంతో కాలు, చెయ్యికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆయనను పైకి లేపారు. మంత్రి గంగులకు పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ మంత్రి గంగులను పరామర్శించి, ప్రమాద వివరాలను తెలుసుకున్నారు.