ఆలయానికి 2 లక్షల విరాళం
దాచుకున్న సొమ్ము వితరణ
కుభీర్, మే 10 : ఏడు పదుల వయసులో ఇతరులపై ఆధారపడి బతుకుతున్న ఓ వృద్ధురాలు తన పెద్ద మనసును చాటుకొన్నది. తాను దాచుకొన్న రూ.2 లక్షల రూపాయలను ఆలయానికి విరాళంగా అందజేసింది. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన కొట్టె భూమవ్వకు 70 ఏండ్లు ఉంటాయి. ఈమె భర్త గతంలోనే మరణించాడు.
సంతానం కూడా లేకపోవడంతో ఒంటరిగా ఉంటున్నది. ఈ మధ్య ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఊర్లనే ఉన్న తమ్ముళ్ల ఇంట్లో ఉంటున్నది. ఈమెకు ఆసరా పింఛన్ వస్తున్నది. అవ్వ.. గతంలో రెండు గుంటల భూమిని విక్రయించగా రూ.2.70 లక్షలు వచ్చాయి. అందులో నుంచి రూ.2 లక్షలను మంగళవారం సాయిబాబా ఆలయ అభివృద్ధికి విరాళంగా అందజేసి గ్రామస్థుల ప్రశంసలందుకొన్నది.