నర్సాపూర్/జఫర్గఢ్, సెప్టెంబర్ 14 : డెంగ్యూతో ఏడేండ్ల చిన్నారి మృతి చెందింది. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన జింకల నర్సింగ్, లహరి దంపతులకు ఏడేండ్ల బాలిక సహస్ర ఒకటో తరగతి చదువుతున్నది. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో నర్సాపూర్ దవాఖానలో వైద్యం అందించారు.
శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లిన చిన్నారి సహస్ర అక్కడ సొమ్మసిల్లి పడిపోయింది. హుటాహుటిన హైదరాబాద్లోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. ప్లేట్లెట్స్ పడిపోయి డెంగ్యూతో మరణించిందని కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపారు.
విషజ్వరంతో చిన్నారి మృతిచెందిన ఘటన జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం ఒబులాపూర్లో శనివారం చోటుచేసుకున్నది. ఒబులాపూర్ గ్రామానికి చెందిన వంగాల దయాకర్, శారద దంపతులకు ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. చిన్నకుమార్తె వంగాల తనూశ్రీ(4)కి నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో చికిత్స నిమిత్తం హన్మకొండలోని ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. చిన్నారి డెంగ్యూతో మృతిచెందినట్టు స్థానికులు చెబుతున్నారు.