Mancherial | హైదరాబాద్ : బ్రెయిన్ డెడ్కు గురైన ఓ వ్యక్తి అవయవాలను అతని కుటుంబ సభ్యులు దానం చేశారు. మొత్తం 8 ఆర్గాన్స్ను జీవన్దాన్ ట్రస్ట్ నిర్వాహకులకు అందజేశారు.
వివరాల్లోకి వెళ్తే.. జనవరి 24వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో మంచిర్యాలకు చెందిన తిరుమల చారి ముల్కోజు(43) ప్రమాదవశాత్తు మొదటి అంతస్తు నుంచి కింద పడిపోయాడు. దీంతో అతన్ని హుటాహుటిన మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం.. సోమాజిగూడలోని యశోద హాస్పిటల్కు తరలించారు.
కోమాలోకి వెళ్లిన అతనికి ఐదు రోజుల పాటు ఐసీయూలో చికిత్స అందించిన ఫలితం లేకుండా పోయింది. జనవరి 31న సాయంత్రం 5:37 గంటలకు అతను బ్రెయిన్డెడ్కు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. బ్రెయిన్డెడ్కు గురైన తిరుమల చారి అవయవాలను దానం చేయాలని కుటుంబ సభ్యులను వైద్యులు ఒప్పించారు. దీంతో జీవన్ దాన్ ట్రస్ట్కు రెండు కిడ్నీలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులతో పాటు రెండు కార్నియాలను దానం చేశారు.