హైదరాబాద్: ఆదిలాబాద్, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు. ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ మండలం సింతాగొంది సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి కంటైనర్ను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తుండా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులను డ్రైవర్ శంశు, సయ్యద్ రఫీతుల్లా, వజహబ్ హస్మి, సలీమాగా గుర్తించారు. గాయపడిన జాబియాను దవాఖానకు తరలించారు.
కాగా, హైదరాబాద్ నగర శివార్లలోని ఔటర్ రింగ్రోడ్డు సమీపంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన టెంపో వాహనం.. కండ్లకోయ వద్ద జాతీయ రహదారిపై లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సికింద్రాబాద్ యశోద దవాఖానకు తరలించారు. ఈ రెండు ఘటనలపై కేసులు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.