హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 6,956 మంది నర్సింగ్ ఆఫీసర్లకు (స్టాఫ్నర్స్) బుధవారం పోస్టింగ్లు ఇవ్వనున్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసారు. 7,094 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదలైంది. తాజాగా తుది ఎంపిక జాబితాను ప్రకటించారు. మొత్తం 9 విభాగాల్లో 6,956 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.
ఆర్థోపెడికల్ చాలెంజ్డ్ క్యాటగిరీలోఅభ్యర్థులు లేకపోవడంతో 138 పోస్టులు భర్తీ కాలేదని అధికారులు తెలిపారు. నర్సింగ్ ఆఫీసర్లకు కనీస వేతనం రూ.36,750తోపాటు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. వీరి వేతనాలతో ప్రభుత్వంపై ఏటా రూ.35 కోట్లు భారం పడుతుందని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థుల్లో దాదాపు 12 శాతం మంది పురుషులు ఉన్నట్టు వెల్లడించారు. కాగా, నర్సింగ్ ఆఫీసర్ల నియామకానికి తమకు ఆహ్వానం అందలేదంటూ నర్సింగ్ యూనియన్లు విమర్శిస్తున్నాయి. తమ వినతులు, ఒత్తిడి ఫలితంగానే గత ప్రభుత్వం స్టాఫ్నర్సుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తుచేశాయి. నర్సింగ్ వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్న తమకు ఆహ్వానం అందకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.