నెలరోజుల్లో నియామక ఉత్తర్వులు: సింగరేణి డైరెక్టర్ ఎన్ బలరామ్
హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో గిరిజన బ్యాక్లాగ్ ఉద్యోగాలకు 665 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరికి నెలరోజుల్లో నియామక ఉత్తర్వులు అందజేస్తామని సింగరేణి డైరెక్టర్(పర్సనల్) ఎన్ బలరామ్ తెలిపారు. సాధారణ వైద్యపరీక్షల అనంతరం అర్హులకు వివిధ ఏరియాల్లోని భూగర్భ గనుల్లో బదిలీ వర్కర్లుగా నియమిస్తామని చెప్పారు.
ఎంతో పారదర్శకంగా నియామక ప్రక్రియను చేపట్టామని స్పష్టంచేశారు. 2017 జూలైలో 665 పోస్టుల భర్తీకి సింగరేణి నోటిఫికేషన్ జారీ చేసి, 2018 జూన్ 8న పరీక్ష నిర్వహించిందని వెల్లడించారు. ఈ నోటిఫికేషన్పై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో నాలుగేండ్లు ఆలస్యంగా శుక్రవారం ఫలితాలు విడుదల చేశామని తెలిపారు. న్యాయపరమైన చిక్కుల పరిష్కారానికి కృషి చేసిన సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ ఎండీ శ్రీధర్కు అభ్యర్థులు, గిరిజన సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు.