హైదరాబాద్, మార్చి 12(నమస్తే తెలంగాణ): ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధారి అటవీ ప్రాంతంలో మినీయేచర్ (లఘు) కాలమ్నార్ బసాల్ట్ శిలలు బయటపడ్డాయి. పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్ (ప్రిహా)కు చెందిన పరిశోధకుడు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తోడిశెట్టి ప్రణయ్ వీటిని కొనుగొన్నారు. ఆరున్నర కోట్ల ఏండ్ల క్రితం భూగర్భం నుంచి బయటకు ప్రవహించిన లావా చల్లారినప్పుడు ఏర్పడిన శిలలనే కాలమ్నార్ బసాల్ట్ శిలలు అంటారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో బసాల్ట్ శిలలను గుర్తించినప్పటికీ మొదటిసారి మినీయేచర్ శిలల్ని ఇక్కడే కనుగొన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చకిలం వేణుగోపాల్రావు తెలిపారు. గతంలో కొన్నగొన్న ప్రాంతాలకు, ఈ ప్రాంతానికి మధ్య ఉన్న తేడాలను అధ్యయనం చేయాలని, దీంతో తెలంగాణలో లావా ప్రవహించిన తీరుతెన్నులు తెలుస్తాయని తెలిపారు. అమెరికాలోని కొలంబియా నది ప్రాంతంలో, ఐస్ల్యాండ్, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో కూడా ఇటువంటి శిలలను గుర్తించారు. కుజ గ్రహంపై ఉన్న ఈ బసాల్ట్ శిలలు మన భూమిపై ఉన్న శిలలకంటే పాతవని 2007లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గుర్తించింది.