పటాన్చెరు టౌన్/అమీన్పూర్ (జిన్నారం), జూలై 17 : రాష్ట్రంలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ 65 శాతం పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పట్టణ పరధిలోని సుల్తాన్పూర్, ఐలాపూర్, పటాన్చెరు పట్టణంలోని పాత జీహెచ్ఎంసీ కార్యాలయం, భగత్ నగర్, ముత్తంగిలో సర్ ప్రక్రియను కలెక్టర్ ప్రతీక్జైన్తో కలిసి పరిశీలించారు.
అనంతరం పటాన్చెరులోని తహసీల్దార్ కార్యాలయంలో ఈఆర్వోలతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గడువు పెంచిన నేపథ్యంలో సర్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. సూపర్వైజర్లు, బీఎల్వో, బీఎల్ఏల పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. గ్రామీణ ప్రాంతాలలో 80శాతం, పట్టణాల్లో 45శాతం వరకు సర్ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు.