హైదరాబాద్: హైదరాబాద్లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఆరేండ్ల చిన్నారి దారుణ హత్యకు గురయింది. కాలనీకి చెందిన పాప గురువారం సాయంత్రం 5 గంటల నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెకోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో పక్కింట్లో ఉండే రాజు అనే వ్యక్తి ఇంట్లో ఆమెను గుర్తించారు. అయితే ఆమె విగతజీవిగా పడిఉండటంతో స్థానికులు ఆందోళనకు దిగారు. బాలికపై లైంగికదాడి జరిగినట్లు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఆమెపై రాజు ఘాతుకానికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు.
కాగా, రాజు నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారితో వాగ్వాదానికి దిగడంతో కాలనీలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నిందితుడిని వెంటనే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడికిదిగారు. ఇందులో పది మంది పోలీసులు, మరో 15 మంది స్థానికులు గాయపడ్డారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టుచేశారు. నిందితునికోసం గాలిస్తున్నారు.