మణుగూరు రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలంలో 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ పురుషోత్తం తెలిపారు. నిన్న సాయంత్రం 4:30 గంటల సమయంలో మణుగూరు ఎస్ఐ పురుషోత్తం తన సిబ్బందితో కలిసి స్థానిక హనుమాన్ టెంపుల్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. అయితే అశ్వాపురం నుంచి వస్తోన్న ఓ ఆటోలోని ఇద్దరు వ్యక్తులు.. పోలీసులను చూసి పరారీ అయ్యారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. ఆటోలోని 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఆటోను పోలీసులు సీజ్ చేశారు.
అనంతరం వారిద్దరిని పోలీసులు విచారించగా, భద్రాచలంలో గంజాయి కొనుక్కొని మణుగూరుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. గంజాయి తరలిస్తున్న వారిని సాకేత్(నరసాపురం గ్రామం), ప్రేమ్ కుమార్(శక్తినగర్) గా పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. 1,20,000 ఉంటుందని పోలీసులు తెలిపారు.