హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు ఉన్న డిమాండ్కు అనుగుణంగా ప్రభుత్వం సీట్ల సంఖ్యను పెంచింది. ఎంబీఏలో 3,060, ఎంసీఏలో 2,700 కొత్త సీట్లకు అనుమతిస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శనివారం జీవో జారీచేశారు. కొన్ని కాలేజీల్లో కొత్త కోర్సులకు, మరికొన్ని కాలేజీల్లో సీట్ల సంఖ్య పెంపునకు అనుమతి ఇచ్చారు. 37 కాలేజీల్లో ఎంబీఏలో ఇది వరకు 3,600 సీట్లుంటే, తాజాగా 3,060 సీట్లను పెంచారు.
25 కాలేజీల్లో ఎంసీఏలో ఇప్పటివరకు 1,260 సీట్లుంటే 2,700 సీట్లు పెంచారు. ఈ సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో భర్తీచేస్తారు. తాజాగా సీట్ల భర్తీకి మరో విడత ఐసెట్ వెబ్ కౌన్సెలింగ్ను దసరా లోపు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఏడాది ఐసెట్లో 61,092 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ఎంబీఏలో 24,487, ఎంసీఏలో 3,316 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కొత్తగా సీట్ల పెంపునకు అవకాశం కల్పించింది.