హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్ రైతుబంధు పంపిణీ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. తొలిరోజు ఎకరం లోపు భూమి ఉన్న 18,12,656 మంది రైతుల ఖాతాల్లో రూ. 544 కోట్ల 55 లక్షల 71వేల 967ను రాష్ట్ర ప్రభుత్వం జమచేసింది. మొత్తం 10,89,113.56 ఎకరాలకు రైతుబంధు పంపిణీ పూర్తయ్యింది. బుధవారం రెండెకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఈ యాసంగిలో 66,61,638 మంది రైతులకు రూ.7,645.66 కోట్లను రైతుబంధు కింద ప్రభుత్వం పంపిణీ చేయనున్నది. పెట్టుబడికి అవసరమైన సమయంలో రైతుబంధు డబ్బులు అందాయని రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
రైతుబంధు సంబురం
రైతుబంధు ఎనిమిదో విడత డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమకావడంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. యాసంగి పనులు ప్రారంభమవుతున్న తరుణంలో పెట్టుబడి సాయం డబ్బులు అందడంతో రైతులు మురిసిపోతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు జరుపుకొన్నారు. ‘రైతు బాంధవుడు సీఎం కేసీఆర్’ అంటూ నినాదాలు చేస్తూ సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలో కేసీఆర్ చిత్రపటానికి రైతులు, టీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్, కోటపల్లి, రామకృష్ణాపూర్లో రైతులు, రైతు సంఘాల నాయకులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం సాటాపూర్ గేట్ వద్ద రైతులు, టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
సీఎం కేసీఆర్కు ఎమ్మెల్సీ పల్లా కృతజ్ఞతలు
8వ విడత రైతుబంధు పంపిణీ ప్రారంభమైన నేపథ్యంలో రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. రైతుబంధు కింద 8 విడతల్లో కలిపి మొత్తం రూ.50 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని పేర్కొన్నారు. కరోనా సంక్షోభ సమయంలోనూ రైతుబంధు నిధులతో రైతులను ఆదుకొన్న రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.