హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో మరో 540 సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది కౌన్సెలింగ్లో భాగంగా కన్వీనర్ కోటాలో ఈ సీట్లను భర్తీ చేస్తారు. ఈ విద్యాసంవత్సరం కొత్తగా మహేశ్వరం, షాద్నగర్, మణగూరుకు కొత్త కాలేజీలు మంజూరయ్యాయి. ఒక్కో కాలేజీలో మూడు కోర్సులకు గాను, ఒక్కో బ్రాంచిని 60 సీట్లతో నిర్వహిస్తారు. దీంతో మూడు కాలేజీల్లో కొత్తగా 540 సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
గత విద్యా సంవత్సరంలో 54 ప్రభుత్వ కాలేజీలు, 64 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ కాలేజీల్లో 12,090, ప్రైవేట్ కాలేజీల్లో 17,600 చొప్పున సీట్లు ఉన్నాయి. వీటికి అదనంగా 540 సీట్లు పెరగనున్నాయి. ఈ నెల 11లోపు పాలిటెక్నిక్ కాలేజీలు, కోర్సులకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి గుర్తింపును జారీ చేయనుంంది. 14 నుంచి పాలిసెట్ మొదటి విడుత కౌన్సెలింగ్ ప్రారంభంకానున్నది.