హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3కి పెద్దఎత్తున అప్లికేషన్లు వచ్చాయి. గ్రూప్-3లో 1,375 ఉద్యోగాలకు గురువారం దరఖాస్తు గడువు ముగియగా, మొత్తం 5,36,477 మంది దరఖాస్తు చేశారు. అంటే ఒక్కో ఉద్యోగానికి సగటున 390 మంది పోటీ పడుతున్నారు. దరఖాస్తులకు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు అవకాశం కల్పించగా, చివరి మూడు రోజుల్లోనే దరఖాస్తులు వెల్లువెత్తాయని టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. త్వరలోనే పరీక్ష తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు.
హడావుడిలో తప్పిదాలు
ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు చివరి రెండు రోజుల్లోనే ఎక్కువ దరఖాస్తు చేస్తున్నారు. హడావుడిలో సాంకేతిక తప్పిదాలు చేసి, దరఖాస్తు తేదీని పొడిగించాలని, సవరణకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గ్రూప్-1లో 503 ఉద్యోగాలు ఉండగా మొదటి రెండురోజుల్లో 3.79 శాతం మంది మాత్రమే దరఖాస్తు చేయగా, చివరి రెండురోజుల్లో 22.37 శాతం మంది అప్లికేషన్లు సమర్పించారు. గ్రూప్-2లో 783 ఉద్యోగాలకు మొదటి రెండు రోజుల్లో 9.24 శాతం దరఖాస్తు చేయగా, చివరి రెండు రోజుల్లో 16.32 శాతం మంది దరఖాస్తులు సమర్పించారు. గ్రూప్-3లో 1,375 ఉద్యోగాలు ఉండగా మొదటి రెండురోజుల్లో 7 శాతం మంది దరఖాస్తు చేయగా, చివరి రెండు రోజుల్లో 10.80 శాతం మంది అప్లికేషన్లు సమర్పించారు. గ్రూప్-4లో 8,180 ఉద్యోగాలకు మొదటి రెండు రోజుల్లో కేవలం 3.45 శాతం మంది దరఖాస్తు చేయగా, చివరి రెండు రోజుల్లో 10.69 శాతం మంది దరఖాస్తు చేశారు. హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడంలోనూ అభ్యర్థులు ఇదే విధానాన్ని పాటిస్తున్నారు. చివరిరోజే ఎక్కువగా హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకొంటున్నారు. దానిలో ఏమైనా తప్పులుంటే గెజిటెడ్ సంతకం చేయించాలి. దీంతో అభ్యర్థులు చివరి నిమిషంలో హైరానా పడాల్సి వస్తున్నది.
అవగాహన కల్పిస్తున్నాం
వీలైనంత వరకు నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నాం. కానీ చివరి నిమిషంలోనే అప్లికేషన్లు ఎక్కువగా వస్తున్నాయి. దీనివల్ల అభ్యర్థులు టెక్నికల్గా తప్పులు చేస్తున్నారు. హాల్టికెట్లను సైతం చివరి రెండురోజుల్లోనే ఎక్కువగా డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీనివల్ల అభ్యర్థులు మానసికంగా ఆందోళనకు గురయ్యే ప్రమాదం ఉన్నది. అందుకే, హాల్టికెట్లు ముందే డౌన్లోడ్ చేసుకోవాలని, అభ్యర్థులను అలర్ట్ చేస్తున్నాం. అభ్యర్థులు సకాలంలో దరఖాస్తు చేసుకోవాలి. చివరి క్షణంలో హైరానా పడకుండా ముందుగానే హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి. బబ్లింగ్ వంటివి ప్రాక్టీస్ చేయాలి.
– జనార్దన్ రెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్