హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ ఫస్టియర్లో ఫెయిలైన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై ఇంటర్బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఇప్పట్లో నిర్వహించబోమని, ప్రస్తుతం ఫెయిలైన వారు, సరిగ్గా రాయలేకపోయిన వారు 2022 ఏప్రిల్లో నిర్వహించే వార్షిక పరీక్షల సమయంలో మళ్లీ రాసుకోవచ్చని ఇంటర్బోర్డు సెక్రటరీ సయ్యద్ ఉమర్ జలీల్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఫస్టియర్ ఫలితాలపై సందేహాలుంటే రీ వెరిఫికేషన్ చేయించుకోవచ్చని సూచించారు. స్కాన్ చేసిన జవాబుపత్రాలు పొంది పరిశీలించుకోవచ్చని వెల్లడించారు. పరీక్షలు సజావుగా నిర్వహించామని, ఫలితాలు సైతం పక్కాగా విడుదల చేశామమని పేర్కొన్నారు. ఫలితాలపై ఇప్పటివరకు ఒక్క ఫిర్యాదూ అందలేదని చెప్పారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం గతేడాది ఆన్లైన్ తరగతులు నిర్వహించామని, ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి మార్చి 23 వరకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించామని తెలిపారు. సిలబస్ను 70 శాతానికి తగ్గించి, ప్రశ్నల్లో 50 శాతం చాయిస్ ఇచ్చామని వెల్లడించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్ను రూపొందించి, వెబ్సైట్, యూట్యూబ్ చానళ్లల్లో అందుబాటులో ఉంచామని వివరించారు. ఫలితాల విడుదల తర్వాత క్లినికల్ సైకాలజిస్ట్లతో హెల్ప్లైన్లు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.
విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఇంటర్ ఫస్టియర్ జవాబు పత్రాల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫీజును 50 శాతం తగ్గించినట్టు ఉమర్ జలీల్ వెల్లడించారు. ఒక్కో సబ్జెక్టుకు రీ వెరిఫికేషన్ ఫీజు రూ.600 నుంచి రూ300లకు, రీ కౌంటింగ్ ఫీజు రూ.100 నుంచి రూ.50కి తగ్గించినట్టు చెప్పారు.