హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పాటైన నాటినుంచి ఇప్పటివరకు ఇసుక విక్రయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.5,098.33 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో రూ.802.11 కోట్ల ఆదాయం రాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు 15 వరకు రూ.304.34 కోట్ల ఆదాయం సమకూరింది.
తెలంగాణలో ఇసుక విక్రయాలను క్రమబద్ధీకరించడంతో అక్రమాలు తగ్గి ప్రభుత్వ ఆదాయం క్రమంగా పెరుగుతున్నది. రాష్ట్రంలోని గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న మొత్తం 64 ఇసుక రీచ్ల నుంచి 8.57 కోట్ల టన్నుల ఇసుకను వెలికితీసేందుకు వీలున్నది. కానీ, ఇటీవల కురిసిన వర్షాల వల్ల నదుల్లో నీటి ప్రవాహం భారీగా ఉండడంతో ప్రస్తుతం 32 రీచ్ల నుంచి మాత్రమే ఇసుక రవాణా జరుగుతున్నదని, రోజూ సగటున 48,700 టన్నుల ఇసుక వస్తున్నదని అధికారులు వెల్లడించారు.