హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని డీఎస్సీ-2008 బాధిత అభ్యర్థులు మంగళవారం ప్రజాభవన్లో ఆందోళనకు దిగారు. స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి కదలబోమంటూ 500 మంది అభ్యర్థులు అక్కడే భీష్మించుక్కూర్చున్నారు.
2008 డీఎస్సీలో నష్టపోయిన మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని గత నెల 8న రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి సూచించిందని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ గోడును వెల్లబోసుకున్నారు. కోర్టు తీర్పును అమలుచేసి, తమ నియామక ప్రక్రియ జరపాలని విజ్ఞప్తి చేశారు. అధికారం చేపట్టిన మూడు నెలల్లోపే 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తమ 15 ఏండ్ల కన్నీళ్లు తుడవాలని కోరారు.
ఏపీలో దాదాపు రెండున్నర సంవత్సరాల క్రితం డీఎస్సీ-2008 బాధితులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు ఇచ్చారని.. స్వరాష్ట్రంలో తమకేం శిక్ష అంటూ వాపోయారు. సీఎం రేవంత్రెడ్డి కల్పించుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం చేస్తామని విద్యాశాఖాధికారి బుర్రా వెంకటేశం హామీ ఇవ్వడంతో అభ్యర్థులు శాంతించారు.