గురుకులాల కిరాణా టెండర్ల ముసుగులో కాంగ్రెస్ సర్కార్ రూ.500 కోట్ల భారీ స్కామ్కు తెరలేపిందని దాసోజు శ్రవణ్కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. రూ.100 కోట్ల కేంద్రీకృత కమీషన్ల కోసమే కలెక్టర్ల అధికారాలకు కత్తెరపెట్టిందని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ తుగ్లక్ నిర్ణయం, రూ. 165 కోట్ల టర్నోవర్ నిబంధనతో చిరువ్యాపారులు, మహిళా సంఘాలకు తీరని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణ బ్రాండ్ తాండూర్ కందిపప్పునకు మంగళంపాడి పేద విద్యార్థులకు ఆఫ్రికా వ్యర్థాలు సరఫరా చేయాలని నిర్ణయించడం దుర్మార్గమని మండిపడ్డారు. శనివారం ఆయన సీఎం రేవంత్రెడ్డి, సీఎస్కు బహిరంగ లేఖ రాశారు.
లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు చదువుకొనే గురుకులాలు, వసతిగృహాలకు కిరాణా, నిత్యావసరాల కొనుగోలును కేంద్రీకృతం చేస్తూ సర్కార్ తీసుకున్న నిరంకుశ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లాస్థాయి టెండర్లతో ప్రభుత్వ పెద్దలకు ‘కిక్ బ్యాక్స్’ దక్కవనే ఏకైక కారణంతో కలెక్టర్ల ఆధ్వర్యంలోని డీపీసీ సిస్టమ్ను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే ఈ టెండర్లపై న్యాయవిచారణ జరిపిస్తామని దాసోజు స్పష్టంచేశారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికైనా సెంట్రలైజ్డ్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.