హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యార్థులను ఉన్నత చదువుల్లో ప్రోత్సహించేందుకు అందజేసే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్స్ (ఎన్ఎంఎంఎస్) లబ్ధిదారుల్లో ఏటా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తగ్గుతున్నారు. అణగారిన వర్గాల ప్రతిభావంతులకిచ్చే ఈ స్కాలర్షిప్ల లబ్ధిదారుల్లో ఈ సామాజికవర్గాల విద్యార్థుల సంఖ్య పడిపోతున్నది. 2018 -19 విద్యాసంవత్సరంతో పోల్చితే 2022 -23లో ఎస్సీ లబ్ధిదారులు 50శాతానికి పైగా తగ్గారు.
ఇక ఎస్టీలు 2019-20 సంవత్సరంతో పోల్చితే 60శాతానికి పైగా తగ్గిపోయారు. నిరుపేద ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు, డ్రాపౌట్లను తగ్గించేందుకు కేంద్ర విద్యాశాఖ ఈ స్కాలర్షిప్లను అందజేస్తున్నది. 9వ తరగతితో ప్రతిభాపరీక్షలో ఎంపికైన విద్యార్థులకు 10, 11, 12 తరగతుల్లో ప్రతి ఏటా రూ.12వేల స్కాలర్షిప్ను అందిస్తారు. లక్షలాది మంది విద్యార్థులకు ఈ స్కాలర్షిప్లను అందజేయనుండగా, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.