Medical Scam | కమీషన్లు భారీగా వస్తున్నాయన్న ఆశతో.. అవసరం లేకున్నా కొందరు అధికారులు ఇబ్బడిముబ్బడిగా మందులు కొనుగోలు చేశారు. ఎంతలా అంటే, వాటి నిల్వ చేయడానికి గోడౌన్లూ సరిపోవట్లేదు. తీరా అవి కాలం చెల్లుతుం డటంతో వాటి ధ్వంసానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం రూ.కోట్లు వెచ్చించి ఓ సంస్థకు కాంట్రాక్టునూ ఇచ్చారు. మొత్తంగా ఖజానాకు రూ.150 కోట్ల మేర గండిపడేలా.. వైద్యశాఖలో వాటాల కేళి ప్రకంపనలు సృష్టిస్తున్నది.
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): వైద్య ఆరోగ్య శాఖలో బిగ్ దందా వెలుగులోకి వచ్చింది. ప్రజారోగ్యానికి అత్యంత కీలకమైన మందుల కొనుగోలులో భారీ అవినీతి జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సప్లయర్లతో కొంతమంది అధికారులు కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగా ఫేక్ ఇండెంట్లు సృష్టించి అవసరానికి మించి మందులు కొనుగోలు చేసినట్టు తెలిసింది. ప్రజారోగ్యాన్ని విస్మరించి, ఉద్యోగ ధర్మాన్ని మరచిపోయి అధికారులు చేసిన నిర్వాకంతో ప్రభుత్వ ఖజానాకు అక్షరాలా రూ.150 కోట్ల వరకు గండిపడినట్టు సమాచారం. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్), డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ), తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) కమిషనర్ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలకు అవసరమైన మందులు సరఫరా అవుతాయి. ఆయా దవాఖానల అవసరాలను బట్టి ఈ శాఖలు ఇండెంట్లు పెడుతాయి.
రాష్ట్రంలోని పెద్ద దవాఖానలు నేరుగా తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ)కి ఇండెంట్లు పెట్టుకునే వీలు కూడా ఉంది. అలా దవాఖానల నుంచి ఇండెంట్లు వచ్చిన తర్వాతే టీజీఎంఎస్ఐడీసీ అధికారులు మందులను కొనుగోలు చేస్తారు. ఇండెంట్ పెట్టిన దవాఖాన.. ఆ మందులను సెంట్రల్ మెడికల్ స్టోర్ల (సీఎంఎస్) నుంచి తప్పనిసరిగా తీసుకెళ్లాలి. కానీ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మందులు సీఎంఎస్లలో మిగిలిపోయినట్టు ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. ఎప్పుడూ లేనివిధంగా టన్నుల కొద్దీ కాలం చెల్లిన మందులు సీఎంఎస్లలో పేరుకుపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒరిజినల్ ఇండెంట్ల ఆధారంగా మందులు కొనుగోలు చేసి ఉంటే.. అరకొర మందులే మిగిలి ఉండేవని, కానీ ఏదో గోల్మాల్ జరిగితే గానీ, ఇంతలా మందులు పేరుకుపోవని కొందరు అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీఎంఎస్లలో రూ.150 కోట్లు విలువజేసే సుమారు 200 ట్రక్కుల కాలం చెల్లిన (ఎక్స్పైరీ) మందులు ఉండటంతో అనుమానాలు మరింతగా బలపడ్డాయి. ఈ క్రమంలోనే ఫేక్ ఇండెంట్ల స్కామ్ బయటపడినట్టు తెలుస్తున్నది.
కొత్త మందులకు జాగ లేదు
జీవో నంబర్ 140 ప్రకారం.. టీజీఎంఎస్ఐడీసీ సంస్థ ‘ఈ-ఔషధి’ వెబ్సైట్ ద్వారానే మందులు కొనుగోలు చేయాలి. మందుల కొనుగోలుకు ఇండెంట్లు తప్పనిసరి. అయితే టీజీఎంఎస్ఐడీసీలోని కీలక అధికారి ఒకరు మరికొంత మందితో సిండికేట్గా ఏర్పడి పెద్దఎత్తున మందులు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనికోసం సదరు అధికారులు భారీగా ఫేక్ ఇండెంట్లు సృష్టించారని, మరికొన్ని మందుల కొనుగోలుకు అసలు ఇండెంట్లనే వాడలేదని తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సీఎంఎస్లలో భారీగా మందులు ఎక్స్పైరీ అయినట్టు తెలిసింది. ఎక్స్పైరీ మం దుల నిల్వలు సీఎంఎస్లలో భారీగా పేరుకొనిపోవడంతో కొత్త మందులు పెట్టేందుకు స్థలం లేకుండా పోయినట్టు సమాచారం. మందుల సరఫరా కంపెనీలతో అధికారులు కుమ్మక్కై అవసరానికి మించి మందులు కొనుగోలు చేసినట్టు అర్థమవుతున్నది.
చక్రం తిప్పిన కీలక అధికారి
టీజీఎంఎస్ఐడీసీలో పనిచేస్తున్న ఓ కీలక అధికారి కమీషన్లకు కక్కుర్తిపడి ఫేక్ ఇండెంట్లకు తెరతీసినట్టు సమాచారం. సదరు అధికారి కొన్నేండ్లుగా అదే సీటులో పాతుకుపోయి ఉన్నట్టు చెప్తున్నారు. తన సీటును పదిలం చేసుకోవడానికి, ఈ స్కామ్ను ముందుకు తీసుకొనిపోవడానికి ఆ కీలక అధికారికి మరికొందరు సాయం చేసినట్టు సమాచారం. ముఖ్యంగా డ్రగ్స్ విభాగంలో పనిచేసిన మాజీ కీలక అధికారి, డయాగ్నొస్టిక్స్లో ఓ ఉన్నతాధికారి, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఓ ఫార్మాసిస్ట్, క్వాలిటీ కంట్రోల్ ఫార్మాసిస్ట్ ఈ స్కామ్లో కీలక పాత్ర పోషించినట్టు చెప్తున్నా రు. టీజీఎంఎస్ఐడీసీలోని కీలక విభాగాధిపతులు ఈ స్కామ్పై ప్రశ్నించకుండా ఉండేందుకు కూడా ఆ కీలక అధికారి అన్ని చర్యలు చేపట్టినట్టు వార్తలు వస్తున్నాయి.
డిస్పోజల్కు కాంట్రాక్ట్ కంపెనీ
కాలంచెల్లిన మందులను డిస్పోజ్ (ధ్వంసం) చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తూరు సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చినట్టు తెలిసింది. సదరు సంస్థ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీగా పనిచేస్తున్నది. సీఎంఎస్లలో మిగిలిపోయిన బయో మెడికల్ వేస్టేజ్ను డిస్పోజ్ చేయడమే ఆ కంపెనీ పని. కాలంచెల్లిన మందులను సదరు కంపెనీ ప్లాంట్కు తరలించేందుకు ట్రక్కుల చార్జీలు, కంపెనీ కాంట్రాక్టు కలిపి మొత్తంగా రూ.5 కోట్ల వరకు ప్రభుత్వం వెచ్చిస్తున్నట్టు తెలిసింది. ఈ మొత్తం కుంభకోణంపై పలువురు హెల్త్ సెక్రటరీ, యాంటీ కరప్షన్ బ్యూరో(ఏసీబీ) డీజీ, విజిలెన్స్ డీజీకి ఆధారాలతో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని వాళ్లు డిమాండ్ చేసినట్టు తెలిసింది. దీనిని మంత్రిత్వ శాఖలోని పై అధికారులు గుర్తించలేదా?అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
కమీషన్ల కోసం కక్కుర్తి ఇలా