హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు రుణాలు తిరిగి చెల్లించటంలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. 2014-15లో రుణాల ఎన్పీఏ 8.88 శాతం ఉండగా, 2021-22కి 1.78 శాతానికి తగ్గింది. క్రమం తప్పకుండా తాము తీసుకొన్న రుణాలు చెల్లించటంతో బ్యాంకులు పెద్దఎత్తున లోన్లు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి. బ్యాంకులు రుణాలిచ్చిన ఏ రంగంలోనూ ఇంత రికవరీ లేకపోవటంతో గత సంవత్సరం కంటే ఈ ఏడాదిలో 50 శాతం అధికంగా రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించాయి. రాబోయే రోజుల్లో ఎన్పీఏలను ఇంకా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి.
మహిళా సంఘాలను ప్రోత్సహించి, మహిళా సాధికారతను సాధించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు, ఉద్యోగులు.. రుణాల చెల్లింపులను నిత్యం పర్యవేక్షిస్తూ, సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా రుణాలు తిరిగి చెల్లించటంలో మహిళా సంఘాలు క్రమశిక్షణ పాటిస్తున్నాయి. మహిళా సంఘాలకు ఇచ్చే రుణం తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు ఐదింతలు పెరిగింది. రాష్ట్రంలో 553 మండల సమాఖ్యలు, 17,952 గ్రామ సమాఖ్యలు ఉన్నాయి.
వీటిల్లో 4.30 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలు ఉండగా 43.46 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీరికి తెలంగాణ వచ్చిన మొదటి సంవత్సరం 2014-15లో రూ.3,738 కోట్ల రుణం ఇవ్వగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐదింతల రుణం పెరిగి రూ.18,069 కోట్లు ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యం పెట్టుకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను కూడా అందిస్తున్నది. ఎస్హెచ్జీలు కూడా ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటున్నాయి.
50 శాతం పెరిగిన రుణ లక్ష్యం
రాష్ట్రంలో మహిళా సంఘాల పనితీరు, రుణాలను వినియోగించుకోవటం, తిరిగి చెల్లించటంలో మెరుగైన పనితీరు కనపరుస్తుండటంతో మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ఉత్సాహంగా ముందుకు వస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్య రంగాలకు నిర్ణయించిన లక్ష్యంలో రుణాలు ఇవ్వటంలో బ్యాంకులు 60 శాతం లక్ష్యం చేరుకోగా, మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వటంలో బ్యాంకులు 102 శాతం లక్ష్యాన్ని చేరుకొన్నాయి.
ఎన్పీఏ కూడా రెండు శాతం లోపలే ఉండటమే దీనికి కారణం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు ప్రాధాన్య రంగాలకు ఇచ్చే రుణ మొత్తాన్ని 10-12 శాతం పెంచగా, మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలను 50 శాతం పెంచారు. 2021-22లో మహిళా సంఘాలకు రూ.12,097 కోట్ల రుణాలు ఇవ్వగా, 2022-23లో 50 శాతం రుణ లక్ష్యాన్ని పెంచి రూ.18,069 కోట్లుగా నిర్ణయించారు. 3,68,192 సంఘాలకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. వీటిలో 1.84 లక్షల సంఘాలకు ఒక్కో సంఘానికి కనీసం రూ.10 లక్షలకు పైగా రుణాలు, అర్హత ఉన్న సంఘాలకు రూ.20 లక్షల రుణం ఇవ్వనున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 950 సంఘాలకు రూ.20 లక్షలకుపైగా రుణాన్ని అందించారు.