హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ)/హిమాయత్నగర్: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ బైక్ను తిరిగి ఇవ్వడానికి రూ.5 వేలు లంచం తీసుకుంటూ నారాయణగూడ ట్రాఫిక్ కానిస్టేబుల్ వికాస్కుమార్ యాదవ్ మంగళవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా రంజాన్ అనే వ్యక్తి బైక్ను పోలీసులు సీజ్ చేశారు. ఆ బైక్ను విడిపించేందుకు తన స్నేహితుడు ఖాజా హబీబుద్దీన్తో కలిసి రంజాన్ కానిస్టేబుల్తో మాట్లాడాడు. బైక్ను వదిలిపెట్టేందుకు కానిస్టేబుల్ రూ.5 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. ఈ విషయంపై హబీబుద్దీన్ ఏసీబీని ఆశ్రయించాడు. నారాయణగూడ ట్రాఫిక్ ఠాణా వద్ద వికాస్ లంచం తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుడిని నాంపల్లిలోని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు.