రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల రూరల్: ఓ హత్య కేసు లో దుబాయ్లో 20 ఏండ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ బిడ్డలు మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృషితో ఒక్కొక్కరుగా ఇండ్లకు చేరుతున్నారు. కొద్దిరోజుల క్రితమే ఇద్దరు ఇంటికి చేరగా, బుధవారం సిరిసిల్ల అర్బన్ మండలం పెద్దూరుకు చెందిన అన్నదమ్ములు శివరాత్రి మల్లేశం (48), శివరాత్రి రవి (45) సొంతూరికి చేరారు. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటకు చెందిన దండుగుల లక్ష్మణ్ (48), చందుర్తి మండలం రుద్రంగికి చెందిన నాంపల్లి వెంకటి (48), సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరుకు చెందిన శివరాత్రి మల్లేశం (48), శివరాత్రి రవి (45), జగిత్యాల జిల్లా మానాలకు చెందిన శివరాత్రి హన్మంతు (51) 2004లో ఉపాధి కోసం దుబాయ్ వెళ్లారు. అక్కడ అడ్డమీద కూలీలుగా పనిచేశారు. ఈ క్రమంలో ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా ఉ న్న నేపాల్కు చెందిన దిల్బహదూర్ 2005లో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఈ ఐదుగురికి అక్కడి కోర్టు 25 ఏండ్ల జైలు శిక్ష విధించింది. అయితే తమ వారిని విడిపించాలని కుటుంబ సభ్యులు అప్పటి కాంగ్రెస్ పాలకులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది.
లాయర్ ఫీజులు చెల్లించిన కేటీఆర్
సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్ 2009లో ఎన్నికవగా, బాధిత కుటుంబసభ్యులు ఆయనను కలిసి వేడుకున్నారు. వారి దయనీయ స్థితికి చలించిన కేటీఆర్ అనేక ప్రయత్నాలు చేశారు. దుబాయ్ చట్టాల ప్రకారం.. బాధిత కుటుంబానికి పరిహారం అందించి, వారి కు టుంబసభ్యులు క్షమాభిక్ష ప్రసాదిస్తే శిక్ష రద్దు అవుతుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ 2013లో స్వయంగా నేపాల్కు వెళ్లి దిల్బహదూర్ భా ర్యకు 15 లక్షలు అందజేసి క్షమాభిక్షకు మా ర్గం సుగమం చేశారు. ఆమె సంతకం చేసిన పత్రాలను కోర్టులో సమర్పించి క్షమాభిక్ష ప్రసాదించాలని కోరారు. వివిధ కారణాల వల్ల నేరతీవ్రతను దృష్టిలో ఉంచుకుని కోర్టు క్షమాభిక్ష ప్రసాదించలేదు. ఈ కేసు వాదించేందుకు దుబాయ్ లాయర్కు ఫీజులు సైతం కేటీఆరే చె ల్లించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తన కార్యాలయ అధికారులను దు బాయ్ పంపించి కేసును సమీక్షిస్తూ వచ్చారు. నిరుడు దుబాయ్ పర్యటనలో భారత కాన్సు ల్ జనరల్ కార్యాలయ అధికారులు, అక్కడి ప్రభుత్వ అధికారులు, కేసు వాదిస్తున్న అరబ్ లాయర్లతో సమావేశమై చర్చించారు. క్షమాభిక్ష ప్రసాదించే విషయమై దుబాయ్ రాజుతో ప్రస్తావించాలని అక్కడి కాన్సుల్ రామ్కుమార్కు విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ 17 ఏండ్ల ప్రయత్నాలతో కోర్టు ఇటీవలే క్షమాభిక్ష పెట్టింది.
ఒక్కొక్కరుగా ఇండ్లకు..
18 ఏండ్లు జైలులో మగ్గిన ఈ ఐదుగురికి విముక్తి లభించగా, ఒక్కొక్కరు విడుదలవుతూ స్వదేశానికి వస్తున్నారు. నెల కిందట కోనరావుపేటకు చెందిన దండుగుల లక్ష్మణ్ (48) విడుదలై ఇంటికి వచ్చాడు. నాలుగు రోజుల క్రితం జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన శివరాత్రి హన్మంతు (51) స్వగ్రామానికి చేరుకున్నాడు. అయితే పెద్దూరుకు చెందిన అన్నదమ్ములు శివరాత్రి మల్లేశం, రవి విడుదల కాగా, టికెట్లకు డబ్బుల్లేక ఆగిపోయారు. వారికి కేటీఆర్ విమాన టికెట్లు సమకూర్చారు. బుధవారం వారు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నా రు. అప్పటికే కేటీఆర్ ఆదేశాలతో కుటుంబసభ్యులను బీఆర్ఎస్ నేతలు అక్కడికి తీసుకెళ్లా రు. అక్కడ తమవారిని చూడగానే భార్య, పిల్ల లు కన్నీటి పర్యంతమయ్యారు. ‘కొడుకులారా..? మిమ్మల్ని జన్మలో చూస్తామనుకోలేదు’ అంటూ వారి తండ్రి ఉద్వేగానికి లోనయ్యారు. తమ వారు కేటీఆర్ సార్ దయతోనే ఇంటికి చేరారని, సార్ సల్లంగా ఉండాలని కుటుంబీకులు తెలిపారు. కేటీఆర్కు కృతజ్ఞతగా గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. మరో వ్యక్తి చందుర్తికి చెందిన నాంపల్లి వెంకటి (48) త్వరలోనే స్వదేశానికి రానున్నాడు.
కేటీఆర్ సార్ సాయంతోనే విడుదలయ్యాం
కేటీఆర్ సార్ సాయంతోనే మేము విడుదలయ్యాం. 30 లక్షల దాకా మా కోసం ఖర్చు పెట్టారు. 15 లక్షలు చనిపోయిన కుటుంబానికి 2013లోనే ఇచ్చిండ్రు. దుబాయ్లో న్యాయసేవల కోసం 13 లక్షలు, ఇతర ఖర్చులు పెట్టి ఇయ్యాల ఇంటి దాకా రప్పిచ్చిండ్రు. ఇయ్యాల మావాళ్లను చూడగానే ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. కేటీఆర్ సార్ దయతోనే వాళ్లను చూస్తున్నం. సార్కు రుణపడి ఉంటాం.
– శివరాత్రి మల్లేశం, పెద్దూరు